Nagababu Slams YS Jagan | జనసేన పార్టీ (Janasena Party) ఎమ్మెల్సీ నాగబాబు (MLC Nagababu) వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan)ను ఉద్దేశించి తీవ్ర విమర్శించారు. వైఎస్ఆర్సీపీని (YSRCP) హిందూ ద్రోహి పార్టీగా అభివర్ణించారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లో గతంలో జరిగిన రామతీర్థం ధ్వంసం, అంతర్వేది రథం దగ్ధం, తిరుమల డిక్లరేషన్ తదితర అంశాలను ప్రస్తావిస్తూ వైసీపీపై మండిపడ్డారు.
అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని నాగబాబు విమర్శించారు. తిరుమల డిక్లరేషన్ ఇవ్వాలని అడిగితే అవమానకరంగా మాట్లాడారని ఆరోపించారు.
గతంలో పవన్ కల్యాణ్ భార్య, కూతురు తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చారని, దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. అబ్దుల్ కలాం కంటే కూడా నీవు గొప్ప వ్యక్తివా అని జగన్ ను ప్రశ్నించారు నాగబాబు.
తిరుమలలో వసతి గృహాల ధరలు పెంచి వేంకటేశ్వర స్వామిని సామాన్య భక్తులకు దూరం చేశారని విమర్శించారు. ఏ మాఫియాను కాపాడటానికి ఇదంతా చేశారని నిలదీశారు. హిందువులపై కుతంత్రాలు చేయడం తప్ప వైసీపీ నేతలకు మరొకటి లేదని అన్నారు.
వైసీపీ నేతలకు ఇతరుల వ్యక్తిగత జీవితాలపై ఉన్న ఆసక్తి… సినిమా రివ్యూలపై ఉన్న శ్రద్ధ.. హిందూ దేవాలయాలపై లేదని విమర్శించారు. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్లారన్న ఆయన ఆలయానికి మద్దతుగా కనీసం మీరు, మీ పార్టీ ఒక ట్వీట్ అయినా చేశారా అని వైఎస్ జగన్ ను ప్రశ్నించారు.










