Minister Jupally Pays Tribute To Martyred Constable Soumya | గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాతో వీరోచితంగా పోరాడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. విధి నిర్వహణలో అసాధారణ తెగువ ప్రదర్శించి అసువులు బాసిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య భౌతికకాయానికి గాంధీ ఆస్పత్రిలో నివాళులర్పించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ సందర్భంగా సౌమ్య కుటుంబసభ్యులను పరామర్శించారు. సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం, సౌమ్య సర్వీస్ కాలం అంటే రిటైర్మెంట్ వయసు వరకు వచ్చే వేతనాన్ని ఆమె కుటుంబసభ్యులకు చెల్లించనున్నట్లు వెల్లడించారు.
విధి నిర్వహణలో ఆమె చూపిన తెగువ, నిబద్ధత స్ఫూర్తిదాయకమన్నారు. ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు ఒక్క రోజు వేతనాన్ని సౌమ్య కుటుంబసభ్యులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని, తమ సహచరిణి కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయం అని పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది భద్రత ప్రభుత్వ కర్తవ్యం అని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల జోలికి వచ్చే దుండగుల వెన్ను వణికించేలా అత్యంత కఠినంగా వ్యవహరించనున్నట్లు హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆయుధాలు ఇచ్చే నిర్ణయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.










