Hydra Commissioner Ranganath Meets AP Deputy CM Pawan Kalyan | హైడ్రా లాంటి వ్యవస్థ అన్ని రాష్ట్రాలకూ అవసరమని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఓ వివాహ వేడుకకు విజయవాడ వెళ్లిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. హైడ్రా లాంటి వ్యవస్థ ఏపీతో పాటు అన్ని రాష్ట్రాలకూ అవసరమని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు. పాలకుల ముందు చూపు.. నిబద్ధత గల అధికారుల పని తీరు ఏ వ్యవస్థకైనా మంచి పేరు తీసుకువస్తాయన్నారు. దేశంలోనే మొట్టమొదటిగా హైడ్రా రూపంలో సరికొత్త వ్యవస్థను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. కొత్త వ్యవస్థను తీసుకురావడమే కాకుండా సరైన అధికారిని నియమించడం అధికారాలు కట్టపెట్టడం పూర్తి స్వేచ్ఛతో పని చేసే అవకాశం కల్పించడం జరిగితే ఫలితాలు బాగుంటాయన్నారు. రంగనాథ్ ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అభినందించారు.










