TGSRTC Yatra Danam | అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థుల కోసం టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సామాజిక బాధ్యతలో భాగంగా ‘యాత్రాదానం’ అనే కార్యక్రమం చేపట్టింది.
వ్యక్తుల పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పండుగలు, ఇతర శుభకార్యాలు, తదితర ప్రత్యేకమైన, ఆనందదాయకమైన రోజుల్లో అనాథలు, నిరాశ్రయులైన వృద్దులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రాంతాలకు, విహారయాత్రలకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
ప్రజలు తమ కుటుంబంలో జరుపుకునే శుభదినం రోజు కొంత మొత్తాన్ని సంస్థకు విరాళంగా అందజేయడం ద్వారా అనాథలు, వృధ్దులకు టీజీఎస్ఆర్టీసీ బస్సు సదుపాయం కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంగళవారం రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ యాత్రాదానం కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తో ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యాత్రదానం కార్యక్రమ నిర్వహణ కోసం పేరుతో ప్రత్యేక నిధిని సంస్థ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వ్యక్తులతో పాటు ప్రజా ప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఎన్ఆర్ఐలు, అసోసియేషన్స్, ఎన్జీవోలు స్పాన్సర్ చేయడం ద్వారా అనాథలు, నిరాశ్రయులైన వృద్దులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ దేవాలయాలకు, పర్యాటక ప్రాంతాలకు, విహారయాత్రలకు తీసుకెళ్లొచ్చని అధికారులు తెలిపారు.
సంతోషకరమైన రోజుల్లో ఈ కార్యక్రమం ద్వారా ఇతరుల్లోనూ ఆనందం కలిగించవచ్చని, ఈ యాత్రాదాన కార్యక్రమాన్ని వ్యక్తులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కూడా వినియోగించుకోచ్చని పేర్కొన్నారు.
యాత్రాదాన కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలను కవర్ చేస్తే ప్రత్యేక టూర్ ప్యాకేజీలను సంస్థ రూపొందించింది. దాతలు చెల్లించే విరాళం మేరకు కిలోమీటర్ల ఆధారంగా ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సులను విహారయాత్రలకు సంస్థ ఏర్పాటు చేస్తుంది. టూర్ ప్రారంభానికి వారం రోజుల ముందు బస్సులను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
స్థానిక ఆర్టీసీ డిపో అధికారులను సంప్రదించి యాత్రాదానం కింద బస్సులను బుకింగ్ చేసుకోవచ్చు. ఆర్టీసీ హెల్ప్ లైన్ నంబర్లు 040 69440000 / 040 23450033 కాల్ చేసి సమాచారం ఇస్తే సంబధిత ఆర్టీసీ అధికారులు ఫోన్ చేసి యాత్రాదాన టూర్ ప్యాకేజీల వివరాలను తెలియజేస్తారు.
యాత్రాదాన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సామాజిక సేవలో భాగంగా వినూత్న ఆలోచనతో యాత్రాదానం కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకువస్తున్న టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా అభినందించారు.
ప్రసిద్ధ దేవాలయాలకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని చాలా మందికి ఉంటుందని, అలాంటి వారికి యాత్రాదానం కార్యక్రమం ఒక వరమని అన్నారు. కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా టీజీఎస్ఆర్టీసీ యాత్రానిధికి విరాళాలు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
వ్యక్తులు కూడా తమ ప్రత్యేకమైన, ఆనందదాయమైన రోజుల్లో అనాథలు, నిరాశ్రయులైన వృద్దులు, దివ్యాంగులకు యాత్రలను దానం చేసి తమ ఉదారతను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో విజయవంతం చేయడంలో ఆర్టీసీ సిబ్బంది కృషి చేయాలన్నారు.
ప్రజలకు మెరుగైన రవాణా సేవలను అందించడంతో పాటు సామాజిక బాధ్యత గల సంస్థగా ముందుకు వచ్చి యాత్రాదానం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. భారతదేశంలోనే మొదటిసారిగా ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమం.. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వస్తోందని ఆయన వెల్లడించారు.
“ఇది సామాజిక సేవ మాత్రమే కాదు. సాంస్కృతిక విలువల పరిరక్షణతో పాటు సమాజానికి ఇచ్చే మానవత్వపు బహుమతి. అనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, నిరుపేద విద్యార్థులను విహారయాత్రలకు తీసుకెళ్లడం ద్వారా వారికి జీవితంలో మరపురాని అనుభూతి కలుగుతుంది.
ఇది ఆధ్యాత్మిక ఆనందంతో పాటు సాంస్కృతిక అవగాహనను కలిగిస్తుంది. దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని కోరుతున్నాం.
ముఖ్యంగా సమాజహితానికి ప్రజా ప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఎన్జీవోలు యాత్రాదానాన్ని వినియోగించుకోవాలి.” అని సజ్జనర్ కోరారు. యాత్రాదానం నిధికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనర్ చెరో లక్ష విరాళంగా ప్రకటించారు. ఈ విరాళానికి సంబందించిన చెక్ లను ఆర్టీసీ ఉన్నతాధికారులకు వారు అందజేశారు.










