Madras High Court denied interim maintenance to a wife with substantial income and assets | మద్రాస్ హైకోర్టు ఇటీవల భార్యాభర్తల మధ్య భరణం చెల్లింపులపై సంచలన తీర్పు వెలువరించింది.
భార్యకు సొంత ఆస్తులు మరియు గణనీయమైన ఆదాయం ఉంటే, ఆమెకు భర్త నుంచి భరణం చెల్లించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు చెన్నైకి చెందిన ఒక వైద్య దంపతుల విడాకుల కేసులో వెలువడింది. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
చెన్నైకి చెందిన వైద్య దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరగడంతో వారు విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా, ఫ్యామిలీ కోర్టు భర్త నెలకు రూ.30,000 భరణంగా భార్యకు చెల్లించాలని ఆదేశించింది.
ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ భర్త మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన భార్యకు సొంతంగా స్థిరాస్తులు ఉన్నాయని, ఆమె స్కానింగ్ సెంటర్ నడుపుతూ గణనీయమైన ఆదాయం పొందుతోందని, అందువల్ల భరణం చెల్లించాల్సిన అవసరం లేదని భర్త వాదించాడు. మద్రాస్ హైకోర్టులో జస్టిస్ పి.బి. బాలాజీ ఆధ్వర్యంలో బుధవారం ఈ పిటిషన్పై విచారణ జరిగింది.
ఇరుపక్షాల వాదనలు, సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం, భార్యకు సొంత ఆస్తులు మరియు స్కానింగ్ సెంటర్ ద్వారా గణనీయమైన ఆదాయం ఉన్నట్లు గుర్తించింది. దీంతో, భార్యకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదని తీర్పు వెలువరించింది. ఫ్యామిలీ కోర్టు జారీ చేసిన రూ.30,000 భరణం ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.
అయితే, దంపతుల కుమారుడు నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నందున, అతని చదువు ఖర్చుల కోసం భర్త రూ.2.77 లక్షలు చెల్లించడానికి అంగీకరించాడు. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవడం అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.









