Allu Aravind’s mother passes away at 94 | టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
94 ఏళ్ల వయసున్న కనకరత్నమ్మ గతకొంత కాలంగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ శనివారం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు అల్లు అరవింద్ ఇంటికి చేరుకుంటున్నారు.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కుటుంబం అరవింద్ ఇంటికి చేరుకున్నారు. కాగా షూటింగ్ నిమిత్తం రాం చరణ్ మైసురులో, అల్లు అర్జున్ ముంబయి లో ఉన్నారు. మరణ వార్త విన్న వారు హైదరాబాద్ బయలుదేరారు. శనివారం సాయంత్రం కొకాపేటలో కనకరత్నమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి.
తన అత్తమ్మ మరణం పై చిరంజీవి స్పందించారు. ‘మా అత్తయ్య గారు.. కీ.శే అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతిః’ అని పేర్కొన్నారు.










