Deputy Cm Pawan Kalyan News | ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఏజెంట్ చేతిలో మోసపోయి విదేశాల్లో మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో మగ్గుతున్న తమ కుమారులను రక్షించాలంటూ గండబోయిన సూర్యకుమారి అనే మహిళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు.
విజయనగరానికి చెందిన ఆమె–మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా ఉన్న తమ వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, వారిని విడిపించేందుకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు బుధవారం పవన్ కళ్యాణ్ ని కలసి.. తమ ఇద్దరు కుమారులతోపాటు 8 మంది మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో ఉన్నట్టు వివరించారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు.
మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో చిక్కుకున్న వారిని రక్షించాలని కోరారు. ఈ వ్యవహారంపై విదేశీ వ్యవహారాల శాఖ సానుకూలంగా స్పందించింది. విదేశాల్లో మగ్గుతున్న వారిని వెనక్కి తీసుకురావడానికి తగిన హామీ ఇచ్చారు.










