No Insurance For Rash Driving Deaths | రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వ్యక్తులకు ఇన్సురెన్స్ (Insurance) చెల్లింపులకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది.
అతి వేగం, నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణిస్తే, ఇన్సూరెన్స్ కంపెనీ బీమా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. 2014 జూన్ 18న కర్ణాటక లో రవీష్ అనే వ్యక్తి, అతి వేగంగా, నిర్లక్ష్యంతో కారు నడిపి మరణించాడు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రూ.80 లక్షలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటులో రవీష్ అతివేగం, నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ధ్రువీకరించారు. అయితే బాధిత కుటుంబం మాత్రం టైరు పేలడం వల్లే ప్రమాదం జరిగిందని కోర్టులో వాదించారు. కానీ నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్టు ఆధారాలు ఉండడంతో వారి వాదనలను హైకోర్టు తిరస్కరించింది.
ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణిస్తే, వారి కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోలేరంటూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహదేవన్ విచారణ జరిపి కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నిర్లక్ష్యంగా వాహనం నడిపితే దానికి ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది.










