Operation Sindoor impacts IPL | పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది అమాయక పర్యాటకులు మరణించారు.
ఈ నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ బుధవారం వేకువజామున పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. ఈ తరుణంలో భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఐపీఎల్ పై ప్రభావం చూపనున్నాయి.
కాగా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మొత్తం 9 ప్రాంతాల్లోని 21 ఉగ్ర శిభిరాలపై భారత్ మెరుపు దాడి చేసింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఉత్తర భారత్ లోని పలు ఎయిర్పోర్టులను మూసివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. శ్రీనగర్, లెహ్, జమ్మూ, అమృత్ సర్, చండీగఢ్, జోధ్పూర్, శిమ్లా, ధర్మశాలలోని విమానాశ్రయాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తెరవద్దని కేంద్రం స్పష్టం చేసింది. దింతో ధర్మశాలలో జరగబోయే మ్యాచుల పై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపించనుంది. మే 8న ధర్మశాల వేదికగా పంజాబ్-ఢిల్లీ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటికే ఢిల్లీ ధర్మశాల చేరుకుంది.
కానీ మే 11న ఢిల్లీ వేదికగా గుజరాత్ తో జరగబోయే మ్యాచ్ కోసం మాత్రం డీసీ ఆటగాళ్లు రోడ్డు మార్గాన వెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు మే 11న ధర్మశాల వేదికగా ముంబయి-పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ముంబయి గురువారం ధర్మశాల వెళ్లాల్సి ఉంది. ఎయిర్పోర్ట్ మూసివేయడంతో తొలుత ముంబయి ఆటగాళ్లు ఢిల్లీ చేరుకుంటారు.
అనంతరం బస్సులో రోడ్డు మార్గాన ధద్మశాల వెళ్తారని తెలుస్తోంది. ఇదే జరిగితే ముంబై ఆలస్యంగా ధర్మశాల చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముంబయి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది ఆసక్తిగా మారింది. ఇకపోతే ఐపీఎల్ పై భారత్-పాక్ మధ్య ఉన్న ఉద్రిక్తల ప్రభావం పై కూడా చర్చ నడుస్తోంది.
కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలను బట్టే తదుపరి కార్యాచరణ ఉంటుందని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. అప్పటివరకు షెడ్యూల్ ప్రకారమే నడుచుకుంటామని పేర్కొన్నారు.