Rajamouli’s concern spurs clean-up drive on Deomali Hill | సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో ఎస్ఎస్ఎంబీ-29 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఇటీవలే సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్ ఒడిశాలో పూర్తయ్యింది.
అనంతరం దర్శకుడు రాజమౌళి ఒడిశా రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన దేవ్ మాలి పర్వతాన్ని ఒంటరిగా ట్రెక్కింగ్ చేశారు. పర్వతంపై ప్రకృతి సౌందర్యం అత్యద్భుతమని కొనియాడారు. కానీ పర్వతంపై చెత్త పెరుకుపోవడం బాధాకరమన్నారు. ట్రెక్కింగ్ చేసే వారు ఎవరి చెత్తను వారే తీసుకెళ్లాలని సూచించారు.
రాజమౌళి చేసిన పోస్టును చూసిన కొందరు స్వచ్ఛందంగా పర్వతాన్ని శుభ్రం చేయడానికి ముందుకొచ్చారు. కోరాపుట్ జిల్లాకు చెందిన పలువురు బృందంగా ఏర్పడి దేవ్ మాలి పై పేరుకుపోయిన చెత్తను, ప్లాస్టిక్ బాటిళ్లను తొలగించారు. ఈ విషయాన్ని ఒడిశాకు చెందిన ఎన్జీఓ ఛైర్మన్ సూపర్నో సత్పతి వెల్లడించారు.
ఈ నేపథ్యంలో రాజమౌళి స్పందించారు. పర్వతాన్ని శుభ్రం చేసిన వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు. భవిష్యత్ తరాల కోసం ప్రకృతి సంపదను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఇలాంటి ప్రదేశాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.










