Kanpur man outsmarts scammer | ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్ల (Cyber Criminals) అక్రమాలు పెరిగిపోతున్నాయి. డిజిటల్ అరెస్ట్ అంటూ, పర్సనల్ వీడియోలు, ఫొటోలు బయటపెడతామంటూ భయపెట్టి అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ తరహా సైబర్ మోసాలపై ప్రభుత్వాలు, పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇదిలా ఉండగా, యూపీలోని కాన్పూర్ ఓ యువకుడు చాకచక్యంగా వ్యవహరించి, ఏకంగా ఓ స్కామర్ నే బురిడీ కొట్టించాడు. బ్లాక్ మెయిల్ కి దిగిన ఆ దుండగుడికి కట్టు కథలు చెప్పి వాడి ఖాతా నుంచి రూ. 10 వేలను తన ఖాతాలోకి బదిలీ చేయించుకోని తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను మోసపోయానని గ్రహించిన మోసగాడు తన డబ్బును తిరిగి ఇవ్వాలని వేడుకున్నాడు.
వివరాల్లోకి వెళితే ఓ స్కామర్ సీబీఐ అధికారిగా నటిస్తూ భూపేంద్ర సింగ్ అనే యువకుడికి ఫోన్ చేశాడు. భూపేంద్రకు సంబంధించిన అశ్లీల వీడియోలు తన వద్ద ఉన్నాయని, కేసును మూసివేయడానికి లంచం ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించాడు.
అయితే ఇది సైబర్ నేరగాడి పని అని గ్రహించిన భూపేంద్ర వాడిని బురిడీ కొట్టించేందుకు పన్నాగం పన్నాడు. సైబర్ నేరగాడితో భయపడుతున్నట్లు నటిస్తూ, అంకుల్, దయచేసి నా అమ్మకి చెప్పకండి, లేకపోతే నేను పెద్ద ఇబ్బందుల్లో పడతాను” అని వేడుకున్నారు.
తాను ఇప్పటికే బంగారు గొలుసు తాకట్టు పెట్టానని, దానిని తిరిగి పొందడానికి రూ.3,000 అవసరమని చెబుతూ ఒక కట్టుకథ చెప్పాడు. ఆ కుట్రలో పడి ఆ స్కామర్ ఆ మొత్తాన్ని భూపేంద్రకు బదిలీ చేశాడు. కొన్ని రోజుల తర్వాత, స్కామర్ మళ్ళీ కాల్ చేశాడు. దీంతో భూపేంద్ర మరో కథ చెప్పాడు. తాను మైనర్ కాబట్టి ఆ నగల వ్యాపారి తన బంగారు గొలుసు ను విడిపించడానికి నిరాకరించాడని మరియు సమస్యను పరిష్కరించడానికి తన తండ్రిగా నటించాలని కోరాడు.
దీంతో భూపేంద్ర స్నేహితుడు నగల వ్యాపారి అవతారం ఎత్తాడు. అతడు స్కామర్తో మాట్లాడి, అదనంగా రూ.4,480 పంపమని ఒప్పించాడు. ఆ గొలుసును తాకట్టు పెట్టడం ద్వారా రూ.1.10 లక్షల రుణం పొందవచ్చని, కానీ రూ.3,000 ప్రాసెసింగ్ ఫీజు అవసరమని స్కామర్ను ఒప్పించాడు.
మోసం గురించి తెలియని స్కామర్ ఆ మొత్తాన్ని బదిలీ చేశాడు. మొత్తానికి భూపేంద్ర ఆ స్కామర్ నుంచి రూ.10,000 వసూలు చేశాడు. చివరికి తాను మోసపోయానని గ్రహించి, తన డబ్బు తిరిగివ్వాలని భూపేంద్రను వేడుకున్నాడు. ఈ సంఘటనపై భూపేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేసి, స్కామర్ నుండి తీసుకున్న డబ్బును ఒక పేదలకు పంచుతానని చెప్పాడు.










