Adipurush Controversy | రామాయణం ఆధారంగా ప్రభాస్ రాఘవుడి పాత్రలో నటించిన సినిమా ఆదిపురుష్ గత వారం విడుదలై మిక్స్ డ్ టాక్ సొంత చేసుకుంది.
అయితే సినిమా విడుదలైన నాటి నుంచి వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. రామాయణాన్ని కించపరిచారంటూ పలు హిందూ సంఘాలు విమర్శించాయి.
ఈ నేపథ్యంలో తాజాగా అలహాబాద్ కోర్టు కూడా ఆదిపురుష్ సినిమా యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
సినిమాలో డైలాగులు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ హిందూ సంఘాలు వేసిన పిటిషన్ పై కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది అగ్నిహోత్రి వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్ రాజేష్ సింగ్ చౌహన్, జస్టిస్ ప్రకాష్ సింగ్ ధర్మాసనం ఆదిపురుష్ దర్శకనిర్మాతలపై మండిపడింది.
Read Also: కేసీఆర్ పై మోదీ విమర్శలు.. ఢిల్లీలో నేతల భేటి ఎఫెక్టేనా!
“సినిమాలో డైలాగులు చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. హనుమంతుడి, సీత పాత్రలు అస్సలు రామాయణానికి పోలిక లేకుండా ఉన్నాయి.
రామాయణం అనేది హిందువులకు చాలా పవిత్రమైంది. అందులోని పాత్రలని ఆదిపురుష్ సినిమాలో వక్రీకరించారు.
సినిమాలోని కొన్ని సన్నివేశాలు చాలా అసభ్యకరంగా ఉన్నాయి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
“రామాయణాన్ని ప్రతి ఒక్కరు బయటకి వెళ్లే ముందు చదువుతారు. ఇలా సినిమాలు తీస్తే ఎలా? హిందువులు చాలా సహనం కల వారు. కాని వారి సహనాన్ని పరీక్షించొద్దు.
ఇలాంటి సినిమాలు చూడటానికి ప్రజలకి బుర్ర లేదనుకుంటున్నారా” అని చిత్ర యూనిట్ పై అసహనం వ్యక్తం చేసింది.
రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు ఇలా అన్ని పాత్రలను సినిమాలో చూపించి, డిస్ క్లయిమర్ వెయ్యడం ద్వారా ప్రజలకి బుర్ర లేదనుకుంటున్నారా అని కోర్ట్ ఆగ్రహం వ్యక్తంచేసింది.
హిందీ భాష సంభాషణల రచయిత మనోజ్ ముంతశిర్ ని ఇంప్లీడ్ చేయాలన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనను ఆమోదిస్తూ ఆయనకు నోటీసులు జారీ చేయాల్సిందిగా కోర్ట్ ఆదేశించింది.