Girl Kisses Rahul Gandhi కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మహారాష్ట్రలోని పుణేలో ఊహించని సంఘటన ఎదురైంది. విద్యార్థుల కోసం నిర్వహించిన ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమంలో ఒక యువతి వేదికపైనే ఆయన బుగ్గపై ఆకస్మికంగా ముద్దుపెట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా, ఇదే వేదికగా రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి.
పుణేలో ‘ఛాత్రోం కీ గూంజ్’ పేరిట ఏర్పాటు చేసిన యువజన సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. సభ అనంతరం వేదికపై ఉన్న యువతీ యువకులతో రాహుల్ గాంధీ సెల్ఫీలు దిగుతున్న సమయంలో, ఓ యువతి అనూహ్యంగా ముందుకు వచ్చి ఆయన బుగ్గపై ముద్దుపెట్టింది.
ఈ హఠాత్ పరిణామంతో రాహుల్ క్షణకాలం ఆశ్చర్యపోయినా, వెంటనే తేరుకుని ఆమెతో సరదాగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. @Snowbel అనే ఎక్స్ (X) ఖాతాలో పోస్ట్ అయిన ఈ వీడియో క్షణాల్లో నెట్టింట వైరల్గా మారింది.
రాహుల్ గాంధీ పట్ల యువతలో ఉన్న అభిమానానికి, ఆయన వారి మధ్య ఎంత సరదాగా ఉంటారో చెప్పడానికి ఇది ఉదాహరణ అని నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.
మనుస్మృతిపై రాహుల్ కామెంట్స్..
ఈ సరదా సంఘటనతో పాటు ఇదే వేదికపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీశాయి. దేశంలో ‘మనుస్మృతి మనస్తత్వం’ రాజ్యమేలుతోందని, మహిళలు పితృస్వామ్య వ్యవస్థను బద్దలు కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన మహిళా నిరసనకారులపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.
రాహుల్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కేశవ్ ఉపాధ్యాయ్ తీవ్రంగా స్పందించారు. ఈ కార్యక్రమాన్ని ఒక ‘రాజకీయ కామెడీ షో’ అని కొట్టిపారేస్తూ, కాలేజీ బస్సుల్లో విద్యార్థులను తరలించి కృత్రిమంగా జనాన్ని సమీకరించారని ఆరోపించారు.
బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సచిన్ సావంత్ తిప్పికొట్టారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా సభకు వేలాదిగా యువత తరలిరావడాన్ని చూసి ఓర్వలేకే బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.











