Jaipal Reddy Death Anniversary | కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి రాజకీయాల్లో నైతికతకు ప్రతీకగా నిలిచారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొనియాడారు. జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి సీఎం ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన జైపాల్ రెడ్డి తుది శ్వాస వరకు విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవ చేశారని పేర్కొన్నారు. ఆయన రాజకీయ జీవితం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
అపారమైన విషయ పరిజ్ఞానం, అసాధారణ వాగ్ధాటితో ప్రజల మనసుల్లోనే కాకుండా పార్లమెంట్లోనూ తనదైన ముద్ర వేసిన అరుదైన నాయకుడు జైపాల్ రెడ్డి అని ముఖ్యమంత్రి ప్రశంసించారు.
జైపాల్ రెడ్డి ఆశయాలు, విలువలను తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తుందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, కాంగ్రెస్ నేతలు రోహిణ్ రెడ్డి, తుమ్మల యుగంధర్ పాల్గొని జైపాల్ రెడ్డికి నివాళులర్పించారు.











