- సీఎం రేవంత్ నిర్ణయాలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు నియామకాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అంతర్గత వివాదానికి దారితీశాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ నియామకాలు కాంగ్రెస్ పార్టీలోని ‘అసలైన’ నాయకులకు, ఇతర పార్టీల నుండి వచ్చిన ‘ఫిరాయింపుదారులకు’ మధ్య కొత్త చిచ్చును రేపాయి.
ఇది ఏకపక్ష నిర్ణయం.. నాకు సమాచారమే లేదు
ఒక ప్రముఖ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.
“నేను మునుగోడు ఎమ్మెల్యేను, నా నియోజకవర్గం యాదాద్రి జిల్లా పరిధిలోకి వస్తుంది. కానీ, యాదగిరిగుట్ట బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నియామకాల గురించి నాకు ఏమాత్రం ముందస్తు సమాచారం లేదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది పూర్తిగా ఏకపక్ష నిర్ణయమని, కనీసం నన్ను సంప్రదించి ఉంటే నా నియోజకవర్గం నుంచి ఒకరికైనా బోర్డులో అవకాశం కల్పించేవాడినని చెప్పారు.
బోర్డు ఛైర్మన్ నియామకంపై తాను వ్యాఖ్యానించనప్పటికీ, సభ్యుల ఎంపికలో కనీస సంయమనం పాటించకపోవడం దారుణమన్నారు. ఇలాంటి ప్రవర్తన వల్ల పార్టీలో పరిస్థితులు చాలా కష్టతరంగా మారుతాయని హెచ్చరించారు.
సీనియర్లను గౌరవించడం తెలియదా?
తాను రాహుల్ గాంధీని కలిశానని, పార్టీ కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటున్నా తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. పార్టీని ఎలా నడపాలి, నియామకాలు ఎలా చేయాలి,
సీనియర్లను ఎలా గౌరవించాలనే విషయాలపై అనుభవం ఉన్న నాయకులు కాంగ్రెస్లో ఉన్నారని గుర్తుచేశారు. “వారికి ఈ విషయాలు తెలియవా?” అని ఆయన పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నించారు.
కొత్తవాళ్ల చేతుల్లోకి పార్టీ.. అసలైన వారు తెరమరుగు..
తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ వాదం కోసం, పార్టీ కోసం నిజాయితీగా పోరాడిన అసలైన కాంగ్రెస్ సభ్యులు క్రమంగా తెరమరుగున పడిపోతున్నారని.. వివిధ నేపథ్యాల నుండి వచ్చిన ఒక కొత్త బృందం (కొత్తగా చేరినవారు) ఇప్పుడు అంతా తమ చేతుల్లోకి తీసుకుని నడిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం సభకు డుమ్మా.. కేవలం ఆర్భాటాలు వద్దు..
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రైతు భరోసా నిధుల పంపిణీ ఎగవేత వంటి విషయాల్లో రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. దీనికి తోడు, ఆదివారం నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ముఖ్యమంత్రి బహిరంగ సభకు ఆయన గైర్హాజరయ్యారు.
“నల్గొండలో ముఖ్యమంత్రి సమావేశానికి హాజరు కావాలని నాకు అనిపించలేదు, దానిపై నాకు ఆసక్తి కూడా లేదు. వారు వ్యవహరించే తీరు అస్సలు బాగాలేదు, అది నాకు నచ్చలేదు.
ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి తప్ప.. కేవలం ఆర్భాటాలు, మితిమీరిన మాటలు, అనవసరమైన హడావుడిని ప్రజలు మెచ్చుకోరు.” అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.









