Telangana fuel shortage rumors government clarification | తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ స్పందించింది.
రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇంధన కొరత ఉందంటూ వస్తున్న వార్తలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని, అటువంటి సమాచారాన్ని నమ్మి ఎవరూ ముందస్తుగా (Panic Buying) పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయవద్దని కోరింది.
రాష్ట్రవ్యాప్తంగా సామాన్య వాహనదారులకు, రైతాంగానికి అవసరమైన ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపింది.
ఎవరైనా కావాలని కృత్రిమ కొరతను సృష్టించినా, ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేసినా లేదా తప్పుడు వార్తలతో ప్రజలను భయపెట్టినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.






