PM Modi Apologizes To Couple | దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తనలోని సున్నిత మనస్తత్వాన్ని మరోసారి చాటుకున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిలిగుడి చేరుకున్న ఆయన, తన కారణంగా ఇబ్బంది పడ్డ నవ దంపతులకు, అతిథులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
అసలేం జరిగింది..
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 12న సిలిగుడిలో భారీ రోడ్ షో నిర్వహించిన అనంతరం, ప్రధాని మోదీ స్థానిక ‘మెయిఫెర్ టీ రిసార్ట్’ (Mayfair Tea Resort) లో బస చేశారు. ప్రధాని బస చేస్తుండటంతో ఆ రిసార్ట్ మొత్తం ఎస్పీజీ (SPG) భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది.
యాదృచ్ఛికంగా అదే రిసార్ట్ లో స్థానిక పారిశ్రామికవేత్త కుమారుడు అక్షయ్, వధువు శ్రేయల వివాహ వేడుక జరుగుతోంది. ప్రధాని భద్రత దృష్ట్యా అతిథులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతించారు. దీనివల్ల పెళ్లికి వచ్చిన వారు కొంత అసౌకర్యానికి గురయ్యారు.
ప్రోటోకాల్ దాటి వచ్చిన ప్రధాని..
వివాహానికి వచ్చిన వారు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని గమనించిన ప్రధాని మోదీ, ఎస్పీజీ ప్రోటోకాల్ను సైతం కాదని నేరుగా పెళ్లి వేదిక వద్దకు వెళ్లారు. నూతన వధూవరులు శ్రేయ-అక్షయ్లను ఆత్మీయంగా పలకరించి ఆశీర్వదించారు.
“నా భద్రత కారణంగా మీరంతా ఇబ్బంది పడ్డారు. ఇది మీ ఇంట్లో జరిగే శుభకార్యం.. ఇందుకు నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను” అని మోదీ పేర్కొన్నారు.
ప్రధాని స్వయంగా వచ్చి పలకరించడంతో వధూవరులతో పాటు అతిథులు కూడా ఆశ్చర్యంతో పాటు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. “ప్రధాని రాకతో మా వివాహ వేడుక చిరస్మరణీయంగా మారిపోయింది” అని నవ దంపతులు మురిసిపోయారు.






