AP CM Chandra Babu Offer| ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మంగళవారం ఆన్లైన్ వేదికగా టెక్ విద్యార్థులతో క్వాంటం టాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచం అంతా క్వాంటం టెక్నాలజీ గురించే ఆలోచిస్తున్నారని తెలిపారు.
భవిష్యత్తులో అన్ని రంగాల్లోనూ క్వాంటం కంప్యూటింగ్ కీలకంగా మారుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. భారతదేశంలో క్వాంటం టెక్నాలజీ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.
అమరావతి క్వాంటం వ్యాలీని ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. క్వాంటం టెక్నాలజీతో పాటుగా దాని అనుబంధ రంగాల్లో14 లక్షల మంది నిపుణులను తయారు చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు.
ఈ సందర్భంగా ఆయన టెక్ విద్యార్థులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. క్వాంటం టెక్నాలజీ ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా నోబెల్ అవార్డు సాధిస్తే.. వారికి రూ.100 కోట్లు అందిస్తామని హామీ ఇచ్చారు. విశాఖను నాలెడ్జ్ ఎకానమీకి, ఏఐ హబ్గా తయారుచేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు.










