‘Ponduru Khadi’ gets GI tag | శ్రీకాకుళం ప్రత్యేకమైన పొందూరు ఖాదీకి అరుదైన గౌరవం దక్కింది. పొందూరు ఖాదీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది. ఈ క్రమంలో పొందూరు ఖాదీ విశిష్టత మరింత విస్తృతం కానుంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్ లభించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఒక శ్రీకాకుళం వాసిగా తనకు ఎంతో గర్వించదగ్గ క్షణం ఇది అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఎన్నో సంవత్సరాల నిరీక్షణ అవిశ్రాంత కృషి, లెక్కలేనన్ని సమావేశాలు, డాక్యుమెంటేషన్, ఫాలోఅప్ల తర్వాత, పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన GI ట్యాగ్ లభించడం ఎంతో అనందం గా ఉందన్నారు. ఇది కేవలం ఒక వస్త్రానికి వచ్చిన గుర్తింపు మాత్రమే కాదు శ్రీకాకుళం నేత కార్మికుల వారసత్వానికి లభించిన గౌరవం అని అన్నారు. శ్రీకాకుళం గర్వం ఇప్పుడు నేడు దేశానికే గర్వకారణం అని స్పష్టం చేశారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన, మహాత్మా గాంధీకి ప్రియమైన పోందూరు ఖాదీ ప్రతి నూలు పోగులో తరాల చరిత్రను మోస్తుందన్నారు.
ఎన్నో కష్టాలు వచ్చినా నేత కార్మికులు తమ కళను వదల్లేదని వారి ఓర్పు, నైపుణ్యం, నమ్మకం ఈ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచాయని గుర్తుచేశారు. ఈ GI ట్యాగ్ సాధనలో అండగా నిలిచిన ఖాదీ & గ్రామీణ పరిశ్రమల కమిషన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తరతరాలుగా ఈ కళను కాపాడిన నేత కార్మికులకు ఈ గౌరవం అంకితం అని ప్రకటించారు. ఈ GI ట్యాగ్ నేతన్నల గుర్తింపును మరింత బలోపేతం చేస్తుందని వారి జీవనోపాధిని మెరుగుపరుస్తుందని పోందూరు ఖాదీకి ప్రపంచ స్థాయిలో కొత్త వైభవం తెస్తుంది ధీమా వ్యక్తం చేశారు.









