Ayodhya Ram Mandir | ఉత్తరప్రదేశ్ లోని రామజన్మ భూమి అయోధ్య (Ayodhya) మంగళవారం అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. బాలరాముడు కొలువైన ఈ గర్భగుడిపై కాషాయ ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేశారు.
రామమందిర నిర్మాణం సంపూర్ణమయిందనే దానికి సంకేతంగా ఈ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ శిఖరంపై 42 అడుగుల ఎత్తులో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ధ్వజాన్ని ఎగురవేశారు. ఈ జెండా కాషాయవర్ణంలో 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పులో లంబకోణ త్రిభుజాకృతిలో ఉంది.
దీనిపై రాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కోవిదార చెట్టు, ఓం చిహ్నాలను బంగారు దారంతో చేతితో ఎంబ్రాయిడరీ చేశారు. ఐక్యత, సాంస్కృతిక పరంపర, రామరాజ్య ఆదర్శాలను ఈ జెండా ప్రతిబింబిస్తుంది.
అయోధ్యలో ఆ అత్యద్భుతమైన ఘట్టాన్ని దాదాపు 7వేల మంది ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.










