BJP MP demands Delhi Name Change | దిల్లీలోని చాందీని చౌక్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ ఓ కీలక ప్రతిపాదన చేశారు. దేశ రాజధాని దిల్లీ పేరు మార్చి, ‘ఇంద్రప్రస్థ’ అనే పేరు పెట్టాలని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
దేశ రాజధాని దిల్లీకి పురాతన సాంస్కృతిక ప్రతీక అయిన ఇంద్రప్రస్థ అనే పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 1న దిల్లీ ఫౌండేషన్ డే సందర్భంగా ఈ లేఖను పంపారు. దిల్లీ చరిత్ర వేల ఏళ్ల పురాతనమైనదని, పాండవులు స్థాపించిన ఇంద్రప్రస్థ భారత నాగరికతకు కేంద్రమైన పట్టణమని తెలిపారు.
అలాగే పాత దిల్లీ రైల్వే స్టేషన్కు ఇంద్రప్రస్థ జంక్షన్, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇంద్రప్రస్థ ఎయిర్పోర్ట్ గా మార్చాలని కోరారు. అదేవిధంగా పాండవుల విగ్రహాలను ప్రతిష్ఠించి, ఆ ప్రాంత చారిత్రక వైభవాన్ని పునరుద్ధరించాలని సూచించారు.
ఇది భారత సంస్కృతి, ధర్మం, చరిత్రకు జీవం పోస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ లేఖ ప్రతులను ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్ మోహన్ నాయుడు, పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ శేఖావత్లకు కూడా పంపారు.
ప్రయాగరాజ్, అయోధ్య, ఉజ్జయిని, వారణాసి వంటి పురాతన నగరాలు తమ చరిత్రను తిరిగి పొందుతున్న వేళ, దిల్లీ కూడా అదే దిశగా అడుగు వేయాలని పేర్కొన్నారు. ఈ మార్పు చారిత్రక న్యాయం, సాంస్కృతిక పునరుజ్జీవనానికి దోహదం చేస్తుందని ఖండేల్వాల్ అన్నారు.
మహాభారత కాలంలో పాండవులు హస్తినాపురం నుండి యమునా తీరం వద్ద ఇంద్రప్రస్థ స్థాపించారని, అది ధర్మం, పాలన, శ్రేయస్సుకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.










