Harish Rao News | కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆరెస్ నేత హరీష్ రావు స్పందించారు. అసెంబ్లీలో 650 పేజీల కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ పెట్టాలని చీల్చి చెండాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. శాసనసభ వేదికగా నిజాలను ప్రజలకు తెలిసేలా ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు వెల్లడించారు.
రాజకీయ వేధింపుల కోసం ఇలాంటి ఎన్నో కమిషన్లు రిపోర్టులు ఇచ్చాయని చరిత్రలో ఏది కూడా న్యాయ స్థానాల ముందు నిలబడలేదని పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన రిపోర్టులు న్యాయస్థానంలో నిలబడవన్నారు. తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కమిషన్ల పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైలీ సీరియల్స్ నడుపుతున్నారని మండిపడ్డారు.
కేవలం కేసీఆర్ ని హింసించాలనే దురుద్దేశం తప్ప రైతులకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలిందని అంటూనే యాదాద్రి జిల్లాకు పోయి గందమల్ల ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టారని వివరించారు.
గందమల్ల కూడా కాళేశ్వరంలో భాగమే అని అన్నారు. కాళేశ్వరం నీళ్లే గందమల్ల ప్రాజెక్టుకు వస్తాయన్నారు. మల్లన్న సాగర్ నుండి నీళ్లు మూసీలోకి పోయడానికి రూ.6000 కోట్లకు టెండర్లు ఫైనల్ చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కూలిందని అబద్దపు మాటలు చెప్పి గందమల్లకు కొబ్బరికాయలు కొట్టి, మల్లన్నసాగర్కు టెండర్లు ఎలా ఖరారు చేస్తారని హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.










