Minister Seethakka Meets Union Minister Annapurna Devi | తెలంగాణ రాష్ట్రంలో 11 వేలకుపైగా అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, వాటి సొంత భవనాల నిర్మాణానికి కేంద్ర నిధులు మంజూరు చేయాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవిని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర మంత్రి సీతక్క.
ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణీలకు బాలింతలకు ప్రతిరోజు 200 ML విజయ మిల్క్ అందిస్తున్నామని, త్వరలో చిన్నారులకు సైతం ఈ పథకాన్ని వర్తింపచేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం తన వంతు సహకారం అందించాలని సీతక్క కోరారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవితో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీతక్క రాష్ట్రంలో అమలవుతున్న పథకాల వివరాలతో కూడిన వినతిపత్రాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు.
ఆరోగ్యలక్ష్మి, పోషణ్ 2.0, సంక్షేమ అంగన్వాడీ వంటి పథకాల ద్వారా తెలంగాణలో మహిళా, శిశు సంక్షేమానికి ప్రభుత్వం అధిక నిధులు వెచ్చిస్తోందని మంత్రి తెలిపారు. అలాగే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల జీతాల్లో కేంద్ర వాటాను పెంచాలని కోరారు. అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.10,950, రూ.6450 చెల్లిస్తుండగా కేంద్రం తన వాటాగా నామమాత్రంగా కేవలం రూ.2700, రూ.1350 మాత్రమే చెల్లిస్తుందని, ఈ మొత్తాన్ని పెంచాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రికి సీతక్క వివరించారు.









