8 Yrs Boy Petition to Guntur Collector | అమ్మ కోసం అధికార యంత్రాగాన్ని కదిలించాడు ఓ ఎనిమిదేళ్ల బాలుడు.
తమ కుటుంబానికి ఆధారమైన టిఫిన్ బండిని రోడ్డు విస్తరణ అని చెప్పి అధికారులు తొలగించారని, దింతో అమ్మ అందరం చనిపోదాం అంటుందని ఆ బాలుడు కుటుంబ దీన పరిస్థితిని వివరించాడు. ఈ ఘటన గుంటూరు లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రాధిక అనే మహిళ టిఫిన్ బండి నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేది. అయితే ఇటీవల రోడ్డు విస్తరణ పనుల కారణంగా టిఫిన్ బండిని అధికారులు తొలగించారు. ఈ నేపథ్యంలో రాధిక కుమారుడు ఎనిమిదేళ్ల యశ్వంత్ సోమవారం కలెక్టర్ ఆఫీసుకు వచ్చాడు. అతన్ని గమనించిన మీడియా ఏమైందని ప్రశ్నించింది.
టిఫిన్ బండి తొలగించడంతో తల్లి రాధిక తీవ్ర ఆవేదన చెందారని, కుటుంబానికి ఆధారమైన బండిని అధికారులు తొలగించారని బాలుడు చెప్పాడు. మళ్లీ బండి పెట్టుకోవడానికి అనుమతు ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదన్నాడు.
దింతో చనిపోదామని తల్లి కన్నీరుతో చెప్పినట్లు బాలుడు తెలిపాడు. బండిని తిరిగి అక్కడ పెట్టుకొనివ్వాలని కోరాడు. ఈ క్రమంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి వినతీ పత్రాన్ని బాలుడు సమర్పించాడు.
ఈ నేపథ్యంలో స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి టిఫిన్ బండిని తిరిగి ఏర్పాటు చేయాలని చెప్పారు. వెంటనే స్పందించిన నగర కమిషనర్ జీజీహెచ్ ఎదుట టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్థలం చూపించారు.










