Ys Jagan About Singaiah Death | సింగయ్య మృతి నేపథ్యంలో రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ స్పందించారు.
సీఎం చంద్రబాబు రాజకీయాలను మరింత దిగజార్చారని మండిపడ్డారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనేది ఆటోమేటిక్ హక్కని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఏదైనా కార్యక్రమం కోసం బయటకు వెళ్తే భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందన్నారు.
అయితే పల్నాడు పర్యటన సమయంలో ముందస్తు సమాచారం, రూట్ మ్యాప్ ఇచ్చినప్పటికీ పైలట్ వెహికిల్స్, రోప్ పార్టీలు కనిపించలేదన్నారు. మాజీ సీఎం పర్యటనలో రోప్ పట్టుకుని వాహనం మీద ఎవరూ పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండదా అని జగన్ ప్రశ్నించారు.
ప్రజల తాకిడి ఎక్కువున్నా రోప్ పార్టీలు, జెడ్ ప్లస్ సెక్యూరిటీ, పైలట్ వాహనాలు ఎందుకు లేవని, ఒకవేళ ఉండి ఉన్నమాటే నిజమైతే ఎవరైనా వాహనం కింద ఎలా పడగలుగుతారు. మరి ఏది వాస్తవం? మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా, లేక వెహికల్ కింద ఎవరూ పడలేదన్నదా? అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
‘జడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ సీఎంకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలి, గవర్నమెంట్ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్కూడా చేయాలి. ఇది ప్రొటోకాల్. మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చెయ్యకపోతే, గవర్నమెంటు అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొనిపెట్టా. డ్రైవర్ను గవర్నమెంటు ప్రొటోకాల్ ప్రకారం ఇచ్చారు. మరి మీ గవర్నమెంటు డ్రైవర్ తోలుతున్న ఈవెహికల్, మీరు ఇచ్చిన పైలట్ వెహికల్స్, మీ రోప్ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న తన వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా?’ అని జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.











