Telangana player Shines In IPL 2026 Auction | ఐపీఎల్ 2026 కు సంబంధించి మినీ ఆక్షన్ లో మెరిసారు తెలంగాణ ప్లేయర్. మంగళవారం అబుదాబి వేదికగా జరిగిన ఆక్షన్ లో డొమెస్టిక్, అన్ క్యాప్డ్ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి కనబరిచాయి. ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ వంటి డొమెస్టిక్ ఆటగాళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. ఈ ఇద్దరిని చెరో రూ.14.20 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది. మరికొందరు అరంగేట్రం చేయని ఆటగాళ్లకు కూడా కోట్లు చెల్లించి మరీ ఐపీఎల్ జట్లు దక్కించుకున్నాయి.
ఈ క్రమంలో తెలంగాణ కరీంనగర్ జిల్లాకు చెందిన పేరాల అమన్ రావు ఐపీఎల్ ఆక్షన్ లో మెరిశారు. ఈ ఆటగాడిని రూ.30 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామం అమన్ రావు స్వస్థలం. తండ్రి మధుసూదన్ రావు కూడా జిల్లా స్థాయి క్రికెట్ ఆడారు. ప్రస్తుతం అమన్ రావు హైదరాబాద్ జట్టు తరఫున అండర్-23 విభాగంలో రంజీ ట్రోఫీ ఆడుతున్నారు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అమన్ రావు బ్యాటింగ్ తో మెరిశారు. రెండు హాఫ్ సెంచరీలు చేశారు. అమన్ రావు ఐపీఎల్ లో ఎంపికవ్వడం పట్ల కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు.










