Meghalaya Honeymoon Murder Case Update | గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు అరెస్ట్ మెమోలో రాసిన ఒక ‘తప్పుడు’ సెక్షన్ నంబర్ తో ఆమెకు బెయిల్ లభించింది.
భారతీయ శిక్షాస్మృతి (IPC) స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం హత్య కేసుకు సంబంధించి సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేయాలి. కానీ, పోలీసులు పొరపాటున అరెస్ట్ మెమో, కేస్ డైరీలలో ఉనికిలో లేని సెక్షన్ 403(1) అని పేర్కొన్నారు.
ఇది కేవలం చిన్న పొరపాటు మాత్రమేనని పోలీసులు వాదించినా కోర్టు అంగీకరించలేదు. నిందితురాలిని ఏ ప్రాతిపదికన అరెస్ట్ చేశారో సరైన కారణం చూపకపోవడం చట్టరీత్యా చెల్లదని కోర్టు స్పష్టం చేసింది.
అరెస్ట్ చేసిన తర్వాత సోనమ్ తనకు నచ్చిన లాయర్ను సంప్రదించే అవకాశం కల్పించలేదని, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని కోర్టు అభిప్రాయపడింది. సోనమ్కు బెయిల్ ఇస్తూనే.. అనుమతి లేకుండా షిల్లాంగ్ విడిచి వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది.
2025 మేలో ఇండోర్కు చెందిన సోనమ్, రాజా రఘువంశీ వివాహం చేసుకుని హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. జూన్ 2న రాజా మృతదేహం ఒక లోయలో దొరికింది. సోనమే తన భర్తను ప్లాన్ ప్రకారం హత్య చేయించినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.







