Six MLCs Vacant In Telangana | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో రెండు మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. మరోవైపు రాష్ట్రంలో 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గవర్నర్ కోటాలో ఇప్పటికే రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
నలుగురు ఎమ్మెల్సీలు తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారంలోగా ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది.
గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఈ 2 సీట్లు కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేసిన వ్యక్తులకే దక్కుతాయి. మిగిలిన నాలుగు స్థానాల్లో కాంగ్రెస్కు ఒక స్థానం దక్కనుంది. బీఆర్ఎస్ ఖాతాలో ఒకటి చేరనుండగా.. మరో 2 స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
ఎమ్మెల్యే కోటాలో కడియం శ్రీహరి, హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్రెడ్డి గెలుపొందారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న నారాయణరెడ్డి కల్వకుర్తి నుంచి గెలుపొందారు.
అదే జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డి నాగర్ కర్నూల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూచుకుళ్ల ఎమ్మెల్సీ పదవిపై కొల్పోయే అవకాశం లేదు. ఇక నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఐదు రోజుల్లో కడియం, కౌశిక్, కసిరెడ్డి, పల్లా తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్నారు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న స్థానాలకు మంత్రివర్గ సమావేశంలో ఇద్దరి పేర్లను ఎంపిక చేసి ఆమోదం కోసం గవర్నర్కు పంపిస్తారు. పట్టభద్రులు, కసిరెడ్డి ఖాళీ అయిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతుండగా, అసెంబ్లీలో సంఖ్యాబలం కారణంగా ఒక సీటు కాంగ్రెస్కు, మరో సీటు బీఆర్ఎస్కు దక్కుతాయి. కానీ, కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను నిలబెడితే మాత్రం అందులోనూ ఎన్నిక అనివార్యమవుతుంది.
ఎవరెవరికి అవకాశం…
Six MLCs Vacant In Telangana ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఆశావహుల సంఖ్య పెద్దగానే ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పలువురు కాంగ్రెస్ కీలక నేతలు ఓటమి పాలయ్యారు. దీంతో వారికి ఎమ్మెల్సీగానైనా చట్ట సభల్లో అడుగుపెట్టాలని ఆశిస్తున్నారు.
కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, మైనంపల్లి హన్మంతరావు, అంజన్ కుమార్ యాదవ్ మధు యాష్కీలతోపాటు, టికెట్ ఆశించి భంగపడ్డ అద్దంకి దయాకర్ కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు.
కాంగ్రెస్ నేతలే ఎన్నికల్లో హస్తం పార్టీకి మద్దతు తెలిపిన పలువురు నాయకులు కూడా ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు. టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, కమ్యూనిస్టులు, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, తీన్మార్ మల్లన్న ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కాంగ్రెస్ గెలుపునకు దోహదపడ్డారు.
ఎన్నికల్లో సీపీఐ, టీజేఎస్తో కాంగ్రెస్ పార్టీ అవగాహన కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో సీపీఐకి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రొఫెసర్ కోదండరామ్కు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంత మంది ఆశావహుల్లో ఈ ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి.