R Narayana Murthy About Chiru’s Post | వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినీ ప్రముఖులు భేటీ అయిన విషయం తెల్సిందే. ఈ భేటీ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో సహా ఇతర నటులను అవమానించారని శాసనసభ వేదికగా బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు.
అనంతరం మాట్లాడిన బాలకృష్ణ జగన్ పై మరియు చిరంజీవి పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. బాలయ్య వ్యాఖ్యలపై చిరు సైతం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదే సమయంలో నటుడు ఆర్ నారాయణ మూర్తి చిరు ప్రకటనపై స్పందించారు. చిరంజీవి చేసిన ప్రకటన వందకు వంద శాతం నిజమన్నారు.
జగన్ తో భేటీ సందర్భంగా చిరంజీవితో పాటు ఇతర నటులకు అవమానం జరిగిందన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఆ రోజు భేటీలో తాను కూడా ఉన్నానని గుర్తు చేసిన నారాయణ మూర్తి జగన్ అందర్నీ ఎంతో గౌరవించారని పేర్కొన్నారు. కరోనా సమయంలో ఇండస్ట్రీ బాగు కోసం చిరంజీవి చొరవ తీసుకుని ఇతర నటుల్ని తీసుకుని అప్పటి ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారని తెలిపారు.
అయితే ఈ భేటీ సందర్భంగా జగన్ ఎవర్నీ అవమానించలేదని నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోజు మీటింగ్ జరిగిన తీరు, నటుల మీడియా సమావేశం జరిగిన విధానం చూస్తే ఈ విషయం అర్ధం అవుతుందన్నారు.










