Two Women Police Constables Marriage మహారాష్ట్రలోని పింప్రి-చించ్వాడ్ పోలీస్ విభాగంలో ఒక అరుదైన మరియు ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న ఇద్దరు మహిళా అధికారులు కలిసి జీవించాలని నిర్ణయించుకోవడమే కాకుండా, వివాహబంధంతో ఒకటయ్యేందుకు సిద్ధమయ్యారు.
పరిచయం నుంచి పెళ్లి వరకు..
ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు మొదట పోలీస్ నియామక ప్రక్రియ సమయంలో కలుసుకున్నారు. మూడేళ్ల క్రితం నియామకం పూర్తయ్యాక కొంతకాలం పోలీస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసిన వీరిద్దరూ, ఆ తర్వాత నగరంలోని ఒకే పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు. ఒకేచోట విధులు నిర్వహిస్తున్న సమయంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు.
పెళ్లి కోసం సెలవు దరఖాస్తు చేసుకున్న వీరు, ఆగస్టు 30న అలందిలో వైదిక సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన వివాహ ఆహ్వాన పత్రికలను, లీవ్ లెటర్లను పోలీస్ స్టేషన్లో సమర్పించారు.
కుటుంబాల వ్యతిరేకత..
విషయం తెలిసిన ఇద్దరి కుటుంబ సభ్యులు ఈ బంధాన్ని, జరగబోయే వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు వివాహాన్ని ఆపాలని కుటుంబ సభ్యులు సీనియర్ పోలీసు అధికారులను కలిసి డిమాండ్ చేశారు. అయితే, ఇది వారి వ్యక్తిగత విషయమని అధికారులు తేల్చి చెప్పారు. వివాహాన్ని అడ్డుకోవడం కుదరదని, అవసరమైతే వారికీ కౌన్సెలింగ్ సేవలు అందిస్తామని స్పష్టం చేశారు.
లింగ మార్పిడి చికిత్స..
వీరిద్దరిలో ఒకరు లింగ మార్పిడికి సంబంధించి వైద్య చికిత్సను కూడా ప్రారంభించారని, ముంబైలోని ఒక ఆసుపత్రిని సందర్శించినట్లు వెలుగులోకి వచ్చింది ఈ చికిత్స మరియు వివాహానికి సంబంధించిన చట్టపరమైన అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
భారతదేశంలో వయోజనుల మధ్య పరస్పర అంగీకారంతో కూడిన స్వలింగ సంబంధాలు నేరం కానప్పటికీ, స్వలింగ వివాహాలకు ప్రస్తుతం చట్టపరమైన గుర్తింపు లేదు. అక్టోబర్ 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, స్వలింగ జంటలకు వివాహం చేసుకునే చట్టపరమైన హక్కును నిరాకరించిన కోర్టు, అటువంటి వివాహాలను గుర్తించే చట్టాన్ని రూపొందించడం పార్లమెంటు పరిధిలోని అంశమని పేర్కొంది.







