Kangana Ranaut Counter To Rahul Gandhi | బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరియు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ప్రముఖ నటి కృతి సనన్ నటించిన రక్షా బంధన్ ప్రకటన (యాడ్) వివాదం నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కంగనా తనదైన శైలిలో స్పందించారు. పితృస్వామ్యాన్ని కూల్చివేయండంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఆమె ఘాటుగా బదులిచ్చారు.
కాంగ్రెస్ వైఖరిపై కంగనా ప్రశ్నల వర్షం..
ఇన్స్టాగ్రామ్లో బీజేపీ చేసిన ఒక పోస్టును కంగనా రీషేర్ చేస్తూ, మహిళల హక్కులు మరియు ప్రాతినిధ్యం విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, త్రిపుల్ తలాక్, షాబానో కేసు వంటి పలు కీలక అంశాలలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలను ఆమె ఈ సందర్భంగా ఎత్తిచూపారు.
“బ్రో.. కాస్త ఆగు.. భారత్ మాతాకీ జై.. ఇక మీరు చెప్పాల్సింది మొదలుపెట్టండి” అంటూ రాహుల్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహిళల గురించి మాట్లాడే ముందు రాహుల్ గాంధీ దేశమాతను గౌరవించాలని ఆమె పరోక్షంగా హితవు చెప్పారు.
రక్షా బంధన్ పండుగ ప్రకటన చుట్టూ మొదలైన ఈ వివాదం, ఇప్పుడు బాలీవుడ్ నుంచి రాజకీయాల వైపు మళ్లి ప్రధాన పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీసింది.











