Friday 15th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > తమిళనాడు ఎన్నికల్లో విదేశీయుల ‘ఓటు’ కలకలం!

తమిళనాడు ఎన్నికల్లో విదేశీయుల ‘ఓటు’ కలకలం!

Foreigners arrested for Voting in TN | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఊహించని పరిణామం వెలుగులోకి వచ్చింది. భారత పౌరసత్వం లేని పలువురు విదేశీయులు నిబంధనలకు విరుద్ధంగా ఓటు వేసి పోలీసులకు చిక్కారు.

ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత తిరిగి తమ దేశాలకు వెళ్లే క్రమంలో మధురై, చెన్నై విమానాశ్రయాల్లో ఇమిగ్రేషన్ అధికారులు వీరిని గుర్తించి అరెస్ట్ చేశారు.

అసలేం జరిగిందంటే..
అరెస్ట్ అయిన 25 మంది భారత సంతతికి చెందిన వారే అయినప్పటికీ, వీరు శ్రీలంక, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. భారతీయ చట్టాల ప్రకారం విదేశీ పౌరసత్వం ఉన్నవారికి ఇక్కడ ఓటు హక్కు ఉండదు.

అయితే, వీరు తప్పుడు ఓటర్ కార్డులను సృష్టించి చెన్నైలోని పెరంబూర్, కేకే నగర్, పట్టుకోట్టై వంటి నియోజకవర్గాల్లో ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఓటు వేసినట్లు గుర్తుగా ఎడమ చేతి చూపుడు వేలికి వేసే సిరా ఇంకు (Indelible Ink) ఆధారంగా అధికారులు వీరిని గుర్తించారు.

విమానాశ్రయంలో పాస్‌పోర్ట్ తనిఖీ చేస్తున్న సమయంలో వేలిపై ఉన్న ఆ చెరగని సిరా చుక్కను చూసి అధికారులకు అనుమానం వచ్చింది. విచారించగా వీరు అక్రమంగా ఓటు వేసినట్లు తేలింది.

అరెస్ట్ అయిన వారిపై ఫోర్జరీ, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ 25 మందే కాకుండా, మరికొందరు విదేశీయులు కూడా ఇలాగే ఓటు వేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అక్రమ ఓటర్ కార్డులు ఎలా వచ్చాయి? దీని వెనుక ఎవరి హస్తం ఉంది? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions