Vemula Prasanth Reddy | ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పై నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ ను తెలంగాణ హైకోర్టు కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. హైకోర్టు నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరుకు, రేవంత్ రెడ్డికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు.
స్పీకర్ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే ఈ కేసును సుమోటోగా తీసుకొంటామని హైకోర్టు పేర్కొనడంతో స్పీకర్ తన నిర్ణయాన్ని జాప్యం చేయలేరని ప్రశాంత్ రెడ్డి అన్నారు. స్పీకర్ కూడా గతంలో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులకు నేను వ్యతిరేకం, వాటిని ప్రోత్సహించనని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
“మణిపూర్, మహారాష్ట్ర రాష్ట్ర కాంగ్రెస్ నుండి పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పై 100 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఆ రాష్ట్ర స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేశారు.
BRS పార్టీ నుండి కాంగ్రెస్ లోకి పార్టీ మారిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలని BRS పార్టీ స్పీకర్ గారికి ఫిర్యారు చేసి చాలా రోజులు పూర్తి అయిన సందర్భంగా హైకోర్టులో BRS కేసు వేసిన దరిమిలా ఈ రోజు 4 వారాల్లో వారిపై అనర్హత వేటు పై స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
కాబట్టి రేవంత్ రెడ్డి ఇంటింటికీ తిరిగి పార్టీలో చేర్చుకున్న BRS ఎమ్మెల్యేలు ఇక అనర్హత వేటు నుండి తప్పించుకోలేరు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని స్పీకర్ హై కోర్టు నిర్ణయానికి కట్టుబడి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ హైకోర్టు కు సమర్పించాలి” అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు.