- నివేదిక చదివి వినిపించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Caste Census Report | తెలంగాణ ప్రభుత్వం కొద్ది రోజుల కిందట సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కులగణన నివేదిక, ఎస్సీ రిజర్వేషన్ల పై చర్చించేందుకు మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్వే పూర్తి నివేదికను అసెంబ్లీ చదివి వినిపించారు.
అ సర్వే నివేదికపై సీఎం రేవంత్ ప్రసంగం యథాతథంగా..
సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే- 2024 నివేదిక
I. పరిచయం:
రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) నిర్వహించాలనే ముఖ్య ఉద్దేశంతో మంత్రి మండలి ఫిబ్రవరి 4, 2024 నా తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణ శాసనసభ ఫిబ్రవరి 16, 2024న క్రింది విధంగా తీర్మానించింది:
“వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలుపరచేలా తెలంగాణ మంత్రివర్గం 04.02.2024 తేదీన చేసిన సిఫారసు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా (సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (కుల గణన)) ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తోంది”
ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల ప్రజలు, రాష్ట్రంలోని ఇతర బలహీనవర్గాల స్థితిగతులను మెరుగు పర్చడానికి వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల కోసం ప్రణాళికను రూపొందించి, అమలు పరచడం కోసం తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, మరియు కుల సర్వే చేపట్టడం కోసం 10-10-2024 తేదీన జి.ఓ.ఎం.ఎస్.నెం. 18ను జారీ చేసింది.
ప్రభుత్వం 19.10.2024 ໖ 122/Cabinet/A2/2024 2 ద్వారా సామాజిక, విద్యా, ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ మరియు కుల సర్వే నిర్వహణను పర్యవేక్షించేందుకు గౌరవ నీటి పారుదల మరియు సీఏడీ; ఆహార మరియు పౌర సరఫరాల మంత్రివర్యులు శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది.
సర్వే నిర్వహించేందుకు ప్రణాళికా శాఖ నోడల్ విభాగంగా నియమించబడింది. సర్వే విధి విధానాలను అవగాహన చేసుకునేందుకు మరియు ఉత్తమ విధానాలను అవగాహన చేసుకునేందుకు ఇతర రాష్ట్రాలైన కర్నాటక మరియు బీహార్ లలో జరిగిన వివిధ సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. ఈ అధ్యయన ఫలితాలను ప్రస్తుత SEEEPC సర్వే విధాన రూపకల్పనలో అనుసంధాన పరచడం జరిగింది.
వివిధ ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, మేధావులు, ఇతర స్టేక్ హోల్డరుల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకొని ఈ క్రింది సర్వే షెడ్యూల్ లను రూపొందించడం జరిగింది.
a) హౌస్లిస్టింగ్ షెడ్యూల్
b) సర్వే షెడ్యూల్
c) ఎన్యుమరేటర్లకు మార్గదర్శకాలు
2. సర్వేలో సేకరించిన సమాచార రకాలు
సర్వే ఫారంలో మొత్తం 57 ప్రశ్నలు ఉండగా, అదనపు ఉప ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ఫీల్డ్స్ లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల అంశాలకు సంబంధించిన సమాచారం సేకరించబడింది.
3. సర్వే విధానం మరియు ప్రణాళిక:
రాష్ట్రంలోని ప్రతి జిల్లాను 150 కుటుంబాలతో కూడిన ఎన్యుమరేషన్ బ్లాకుగా (Enumeration Blocks EB) విభజించబడింది. తద్వారా 94,261 ఎన్యుమరేషన్ బ్లాక్ లను ఏర్పాటు చేయడం జరిగింది.
* ప్రతి ఎన్యుమరేషన్ బ్లాక్ కి ఒక ఎన్యుమరేటర్ ను మరియు ప్రతి 10 మంది ఎన్యుమరేటర్లను పర్యవేక్షించడానికి ఒక సూపర్వైజర్ ని నియమించడం జరిగింది.
తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,03,889 ఎన్యుమరేటర్లు మరియు సూపరవైజర్లను నియమించడం జరిగింది.
4. క్షేత్ర స్థాయిలో సర్వే
* సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్యా, రాజకీయ మరియు కుల (SEEEPC) సర్వే 2024 నవంబర్ 6న హౌస్-లిస్టింగ్ తో ప్రారంభమైంది.
* మొదటి దశలో, హౌస్-లిస్టింగ్ 6 నవంబర్ నుండి 8 నవంబర్ 2024 వరకు 3 రోజుల పాటు నిర్వహించబడింది. అసలైన సర్వే 9 నవంబర్ 2024 నుండి, గౌరవ తెలంగాణ గవర్నర్ గారితో ప్రారంభమైంది.
* రాష్ట్రంలో సర్వే 06.11.2024 న ప్రారంభమై 25.12.2024 న పూర్తయింది (50 రోజులు). సర్వే ముగిసే సమయానికి, మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య గ్రామీణ ప్రాంతం లో – 66,99,602 మరియు నగర ప్రాంతం లో – 45,15,532. కాగా, మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య 1,12,15,134.
* హౌస్-లిస్టింగ్ చేసిన మొత్తం 1,15,71,457 కుటుంబాలకు గాను 1,12,15,134 గా ఉంది. సర్వే కవరేజ్ ను 96.9% గా సూచిస్తుంది
* ఇతర కారణాల వల్ల సర్వే చేయని కుటుంబాల మొత్తం సంఖ్య 3,56,323. ఎక్కువగా సర్వే చేయని కుటుంబాలు GHMC మరియు ఇతర నగర ప్రాంతాల్లో ఉన్నాయి.
5. డేటా ఎంట్రీ
* రాష్ట్రంలో డేటా ఎంట్రీ 20.11.2024న ప్రారంభమై 25.12.2024న పూర్తయింది. డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి మొత్తం 36 రోజులు పట్టింది.
* 2024 ఫిబ్రవరి 4న మంత్రి మండలి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సర్వే అన్ని అంశాల్లో ఒక సంవత్సరం లోపున విజయవంతంగా పూర్తి చేయబడింది. ఇది సమర్థవంతమైన అమలు మరియు సకాలంలో లక్ష్యాల సాధనను ప్రతిబింబిస్తుంది.
6. సర్వే నుండి లభించిన డేటా ఫలితాలు
ఈ క్రింది సర్వే డేటా మరియు ఫలితాలు పూర్తిగా తెలంగాణ నివాసితులు ఎన్యుమరేటర్లకు స్వచ్ఛందంగా చెప్పిన సమాచారంపై ఆధారపడ్డాయి:
ఈ సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయడం జరిగింది. ఈ మొత్తం లో సామాజిక వర్గాల వారీగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది…
* SC లో 61,84,319 మంది ఉండగా ఇది మొత్తం లో 17.43 శాతం గా ఉంది.
* ST లో 37,05,929 ఉండగా ఇది మొత్తం లో 10.45 శాతం.
* BC (ముస్లిం మైనారిటీ మినహా) లో 1,64,09,179 ఉండగా ఇది మొత్తంలో 46.25 శాతం గా ఉంది.
* ముస్లిం మైనారిటీల లో మొత్తం 44,57,012 ఉండగా ఇది మొత్తం లో 12.56 శాతం గా ఉంది.
* ముస్లిం మైనారిటీ లో BC లు 35,76,588 ఉండగా, ఇది మొత్తం లో 10.08 శాతం గా ఉంది.
* ముస్లీం మైనారిటీ లో OC లు 8,80,424 ఉండగా ఇది మొత్తం లో 2.48 శాతం గా ఉంది.
* OC లో 56,01,539 మంది ఉండగా ఇది మొత్తం లో 15.79 శాతం గా ఉంది.
* OC లలో ముస్లీం మైనారిటీ లు 8,80,424, ఇది మొత్తం లో 2.48 శాతం గా ఉంది.
* ముస్లిం మైనారిటీ మినహా OC లు 47,21,115 ఉండగా ఇది మొత్తం లో 13.31 శాతం గా ఉంది.
7. ముగింపు
ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాలను రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఈ చర్య సమానతా వృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరియు తెలంగాణ ప్రజల విభిన్న అవసరాలను తీర్చే పద్ధతిని ప్రతిబింబిస్తుంది. ఇది డేటా ఆధారిత, సమగ్రత మరియు పారదర్శకత ప్రాతిపదికగా నడిచే పాలనకు నూతన దశ ప్రారంభాన్ని సూచిస్తుంది.
- ఎ. రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి