Union Govt Clarity On Fuel Price Hike | పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాల నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు భారీగా పెరుగుతాయనే ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇచ్చింది.
ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచే ప్రతిపాదన ఏదీ లేదని మంగళవారం కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించింది.
దేశంలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని, ధరలు పెరగలేదని కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ స్పష్టం చేశారు.
అంతర్జాతీయ మార్కెట్లలో మారుతున్న పరిణామాలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని తెలిపారు. దిగుమతులపై కొంత ప్రభావం ఉన్నప్పటికీ, దేశీయంగా సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
గృహ వినియోగదారులకు, రవాణా రంగానికి సీఎన్జీ సరఫరాను 100 శాతం నిర్ధారించింది. వాణిజ్య ఎల్పీజీ సరఫరాను ఇప్పటికే 70 శాతానికి పునరుద్ధరించామని, ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపింది.
వలస కార్మికుల కోసం 5 కిలోల ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం దాదాపు రెట్టింపు చేసినట్లు పేర్కొంది. ఫార్మా, స్టీల్, వ్యవసాయం వంటి కీలక పరిశ్రమలకు ఇంధన కొరత రాకుండా ప్రభుత్వం హామీ ఇచ్చింది.







