Brother-in-law killed for being short | ఆంధ్రప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగుచూసింది. కులాంతర, మతాంతర వివాహాల సమయంలో పరువు హత్య చూసి ఉంటాం. కానీ దూరపు బంధువు పొట్టిగా ఉన్నాడని తిరస్కరించినా తన చెల్లికి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని పెళ్ళైన పది రోజులకే బావను చంపాడు ఓ బావమరిది.
ఈ ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. బాపట్ల జిల్లా వేమూరు మండలం ఎడవూరు గ్రామానికి చెందిన కుర్రా గణేష్ కొద్దీ రోజుల క్రితం తెనాలికి చెందిన దూరపు బంధువు కీర్తి అంజనీ దేవి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళాడు. అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ అబ్బాయి పొట్టిగా ఉన్నాడని అమ్మాయి కుటుంబ సభ్యులు సంబంధాన్ని తిరస్కరించారు.
మరోవైపు ఫోన్ లో కొద్దిరోజులుగా మాట్లాడుకుంటున్న అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. కుటుంబ సభ్యులు వద్దు అని చెప్పినప్పటికీ అమ్మాయి మాత్రం గణేష్ తో పెళ్లికి సిద్ధం అయ్యింది. ఈ క్రమంలో పది రోజుల క్రితం గణేష్ మరియు అంజలీ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం అంజలీ అన్న దుర్గారావుకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. పలు సందర్భాల్లో గణేష్ ని చంపేస్తానని అతడు వార్నింగ్ సైతం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో నవ దంపతులు నల్లపాడు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
అనంతరం పెళ్లి సాదాసీదాగా చేసుకున్నప్పటికీ రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా చేసుకోవాలని భావించిన గణేష్ డబ్బుల కోసం గుంటూరులో బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు వెళ్ళాడు. బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని వస్తుండగా దుర్గారావు తన స్నేహితులతో వచ్చి బావపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కత్తులతో పొడిచి చంపేశాడు. కసాయి దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గణేష్ పొట్టిగా ఉన్నాడని పెళ్లి సంబంధాన్ని తమ కుటుంబం సభ్యులు తిరస్కరించారని, అయినప్పటికీ తన చెల్లికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడని దుర్గారావు పోలీసుల ఎదుట చెప్పాడు. అలాగే తన సోదరి కంటే గణేష్ పొట్టిగా ఉన్నాడనే చంపినట్లు దుర్గారావు నేరం అంగీకరించాడు.











