Bandla Ganesh Meets CM Chandrababu At AP Assembly | ముఖ్యమంత్రి చంద్రబాబును సినీ నిర్మాత బండ్ల గణేష్ కలిశారు. ఈ సందర్భంగా బండ్లను పలకరించిన చంద్రబాబు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో గురువారం బండ్ల గణేష్ చంద్రబాబును కలిశారు. గతంలో చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో ఆయన క్షేమంగా బయటకు వచ్చి, ముఖ్యమంత్రి కావాలని బండ్ల గణేష్ తిరుమల శ్రీవారిని మొక్కుకున్నారు. తన మొక్కు నెరవేరడంతో జనవరి 19న షాద్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ‘సంకల్ప యాత్ర’ పేరుతో తిరుమలకు పాదయాత్ర చేపట్టారు.
23 రోజుల పాటు 535 కి.మీ. మేర నడిచి తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం సీఎంను కలిసి శ్రీవారి తీర్ధప్రసాదాన్ని అందజేశారు. పాదయాత్ర తీరును సీఎం అడిగి తెలుసుకున్నారు. ఏడుకొండలవాడిపై బండ్లకు ఉన్న భక్తి, తనపై చూపిన అభిమానం ఎంతో సంతోషాన్ని కలిగించాయని సీఎం హర్షం వ్యక్తం చేశారు. తాను అభిమానించే వారికి మంచి జరగాలని దేవుడికి మొక్కుకున్న గణేష్ ఆ మొక్కును తాజగా తీర్చుకున్నారని సీఎం అభినందనలు తెలియజేశారు.










