Baahubali Helmet Unveiled | హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, వాహనదారుల్లో హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించేందుకు తార్నాక జంక్షన్ వద్ద ఒక భారీ ‘బాహుబలి హెల్మెట్’ శిల్పాన్ని ఆవిష్కరించారు.
సర్వేజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ వినూత్న శిల్పాన్ని ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. గురవారెడ్డి మరియు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ ప్రారంభించారు.
హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే ప్రాణాపాయం గురించి ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించేందుకు ఈ బాహుబలి హెల్మెట్ శిల్పాన్ని ఏర్పాటు చేశారు.
ఇది కేవలం ఒక ప్రదర్శన వస్తువు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ తమ భద్రతను గుర్తుచేసుకునేలా చేసే ‘రిమైండర్’ అని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా జోయెల్ డేవిస్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, అది కేవలం చలాన్ల నుండి తప్పించుకోవడానికి కాదని, తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అని స్పష్టం చేశారు.
బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ద్వారానే రోడ్డు ప్రమాదాలను తగ్గించగలమని ఆయన పిలుపునిచ్చారు. సామాజిక బాధ్యతలో భాగంగా సర్వేజన ఫౌండేషన్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ పోలీసులు అభినందించారు.






