Land Auction 269 Crore Per Acre హైదరాబాద్ ఐటీ కారిడార్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేసేలా భూముల ధరలు సరికొత్త ఆల్-టైమ్ రికార్డును సృష్టించాయి. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) నిర్వహించిన ఆన్లైన్ వేలంలో రాయదుర్గంలోని ఒక ప్రభుత్వ స్థలం ఎకరాకు ఏకంగా రూ. 269 కోట్లకు అమ్ముడైంది.
హైదరాబాద్కు చెందిన ప్రముఖ రియల్టీ సంస్థ వంశీరామ్ బిల్డర్స్ అత్యధిక బిడ్డర్గా నిలిచి ఈ స్థలాన్ని కైవసం చేసుకుంది.
రూ. 1,447 కోట్ల మెగా డీల్..
రాయదుర్గంలోని సర్వే నెం. 83/1లో ఉన్న 5.38 ఎకరాల స్థలానికి ప్రభుత్వం ఆన్లైన్ వేలం నిర్వహించింది. ఎకరాకు రూ. 175 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించగా, డెవలపర్ల మధ్య నడిచిన తీవ్ర పోటీ వల్ల చివరి బిడ్ ఎకరాకు రూ. 269 కోట్లకు చేరింది. ఇది రిజర్వ్ ధర కంటే 52.3% ఎక్కువ.
ఈ 5.38 ఎకరాల వేలం ద్వారా ప్రభుత్వానికి రూ. 1,447.22 కోట్ల ఆదాయం సమకూరింది.
వారం వ్యవధిలోనే పాత రికార్డు బ్రేక్..
ఆగస్టు 21న నిర్వహించిన వేలంలో MSN రియల్టీ సంస్థ రాయదుర్గంలోనే 5.25 ఎకరాల ప్లాట్ను ఎకరాకు రూ. 264 కోట్లతో దక్కించుకుంది. అయితే కేవలం వారం రోజుల్లోనే ఆ రికార్డును దాటుతూ, ఎకరాకు మరో రూ. 5 కోట్లు అదనంగా పలుకుతూ రూ. 269 కోట్ల వద్ద కొత్త మైలురాయి నమోదైంది.
భూముల ధరల వరుస పెరుగుదల..
అక్టోబర్ 2025లో ఎకరాకు రూ. 177 కోట్లు, మే 2026లో ఎకరాకు రూ. 237 కోట్లు, ఆగస్టు 21, 2026లో ఎకరాకు రూ. 264 కోట్లు ఆగస్టు 28. 2026లో ఎకరాకు రూ. 269 కోట్లు (తాజా రికార్డు)
ప్రభుత్వానికి రూ. 2,833 కోట్ల ఆదాయం..
ఆగస్టు నెలలో నిర్వహించిన రెండు వేలంపాటల్లో రాయదుర్గంలోని మొత్తం 10.63 ఎకరాల భూమి ద్వారా ప్రభుత్వానికి రూ. 2,833.22 కోట్లు లభించాయి.
MSTC ఇ-ఆక్షన్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ వేలం నిర్వహించగా, TGIICకి జెఎల్ఎల్ (JLL) సలహాదారుగా వ్యవహరించింది. ఈ ఫలితం హైదరాబాద్పై పెట్టుబడిదారులకు ఉన్న అపారమైన నమ్మకానికి నిదర్శనమని టీజీఐఐసీ వీసీ అండ్ ఎండి కె. శశాంక తెలిపారు.








