- ప్రధాని మోదీ వీడియోపై పీఐబీ ఫాక్ట్ చెక్ క్లారిటీ!
PM Modi Fake Investment Video PIB Fact Check | కేవలం రూ. 21 వేల పెట్టుబడి పెడితే చాలు.. ఏకంగా రూ. 3.5 లక్షల వరకు భారీ ఆదాయం పొందే అద్భుతమైన అవకాశం ఉందంటూ, ఈ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రమోట్ చేస్తున్నట్లు ఉన్న ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
సాక్షాత్తూ దేశ ప్రధాని ఒక పథకాన్ని సిఫార్సు చేస్తుండటంతో సామాన్య ప్రజలు దీనిని నిజమేనని నమ్మి మోసపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ (PIB) ఫాక్ట్ చెక్ విభాగం తక్షణమే స్పందించి అసలు నిజాలను బయటపెట్టింది.
పూర్తిగా నకిలీ.. ‘డీప్ఫేక్’ సృష్టి..
వైరల్ అవుతున్న ఆ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన పీఐబీ ఫాక్ట్ చెక్ టీమ్, అది ముమ్మాటికీ నకిలీ వీడియో అని తేల్చిచెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలాంటి ఎలాంటి ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్కు (Investment Scheme) సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదని పీఐబీ స్పష్టం చేసింది.
టెక్నాలజీ దుర్వినియోగం..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు అత్యాధునిక డీప్ఫేక్ టెక్నాలజీ సహాయంతో ప్రధాని మోదీ గొంతును, ముఖ కవళికలను మార్చి సైబర్ కేటుగాళ్లు ఈ నకిలీ వీడియోను సృష్టించినట్లు అధికారులు గుర్తించారు.
కేటుగాళ్ల ట్రాప్లో పడకండి..
పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజలను బురిడీ కొట్టించి, వారి సొమ్మును దోచుకోవడానికే సైబర్ నేరగాళ్లు ఇలాంటి తప్పుడు ప్రచారాలకు తెరలేపుతున్నారని పీఐబీ హెచ్చరించింది.
సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఇలాంటి నకిలీ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్ల ప్రకటనలను చూసి ప్రజలు మోసపోవద్దని, కేటుగాళ్ల ట్రాప్లో పడి అనాలోచితంగా డబ్బులు పెట్టుబడి పెట్టకూడదని కేంద్ర ప్రభుత్వ విభాగం గట్టిగా సూచించింది.
ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టే ముందు అధికారిక వెబ్సైట్లలో సరిచూసుకోవాలని స్పష్టం చేసింది.







