Revanth Reddy Letter To Kishan Reddy | హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు (Hyderabad Metro Project) వ్యవహారంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
తనపై కిషన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలకు స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం కేంద్రమంత్రికి ఒక బహిరంగ లేఖ రాశారు.
మెట్రో వివాదంపై చర్చించేందుకు తాను సిద్ధమేనని ప్రకటించిన ముఖ్యమంత్రి.. ఈ సమస్య పరిష్కారం కోసం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డిని కోరారు.
లేఖలోని ప్రధానాంశాలు..
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 (Hyderabad Metro Phase-2) విస్తరణకు అవసరమైన కేంద్ర ప్రభుత్వ అనుమతులను తీసుకురావడంలో, అలాగే ఐఆర్ఎఫ్సీ (IRFC) రుణ నిధుల విడుదలలో ఇక ఎంతమాత్రం జాప్యం చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డి లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రాజెక్టుకు ఉన్న ఆర్థిక, సాంకేతిక అడ్డంకులను తొలగించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో తక్షణమే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు.
మెట్రో రైలు మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి కేంద్రం పిలిచే ఎలాంటి సమావేశానికైనా, ఎక్కడైనా హాజరయ్యేందుకు తాను పూర్తి సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
మీ కాల్ కోసం వెయిటింగ్..
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీని ఖరారు చేసి, ఆ వివరాలను తనకు తెలియజేయడానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నుంచి వచ్చే ఫోన్ కాల్ కోసం తాను ఎదురుచూస్తున్నట్లు (వెయిటింగ్) రేవంత్ రెడ్డి లేఖలో ప్రత్యేకంగా పేర్కొన్నారు.







