- గాలి జనార్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
Jai Shree Ram In School Attendance | కర్ణాటక రాజకీయాల్లో హిందుత్వం, విద్యాసంస్థల నిబంధనల చుట్టూ సాగుతున్న రాజకీయం మరో మలుపు తిరిగింది.
స్కూళ్లు, కాలేజీల్లో ప్రతిరోజూ ఉదయం హాజరు (Attendance) తీసుకునే సమయంలో విద్యార్థులు ‘యస్ సర్’ లేదా ‘యస్ మేడమ్’ అని పలకడానికి బదులుగా.. “జై శ్రీరామ్” అని అనాలంటూ బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం హిజాబ్పై నిషేధాన్ని ఎత్తివేస్తూ తీసుకున్న తాజా నిర్ణయాల నేపథ్యంలో గాలి జనార్ధన్ రెడ్డి ఈ విధమైన ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
హిజాబ్ వర్సెస్ కాషాయ శాలువాలు..
కర్ణాటకలో గతంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై పూర్తి నిషేధం విధించింది. ఇది అప్పట్లో దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన పెద్ద ఇష్యూగా మారింది.
అయితే, తాజాగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హిజాబ్పై ఉన్న పాత నిషేధాన్ని రద్దు చేసింది. విద్యాసంస్థల్లో మత సంప్రదాయాలకు సంబంధించిన దుస్తులు, చిహ్నాలను ధరించేందుకు వీలుగా సరికొత్త సర్క్యులర్ జారీ చేసింది.
బసనగౌడ పాటిల్కు మద్దతుగా వ్యాఖ్యలు..
కాంగ్రెస్ ప్రభుత్వం హిజాబ్కు అనుమతి ఇవ్వడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ మాజీ నేత, ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ చేసిన వ్యాఖ్యలకు గాలి జనార్ధన్ రెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు.
“నేను ఏ పాఠశాలకు లేదా కాలేజీకి వెళ్లినా విద్యార్థులకు ఒకటే చెప్తాను. మనం భారతీయులం.. సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థులంతా కాషాయ శాలువాలు ధరించాలి.
ఇకపై క్లాస్ రూమ్లలో అటెండెన్స్ పిలిచినప్పుడు ‘యస్ సర్/మేడమ్’ అని కాకుండా, గర్వంగా ‘జై శ్రీరామ్’ అని పలకాలి” అని జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఒక వర్గానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే.. తాము కూడా హిందూ సంస్కృతిని విద్యాసంస్థల్లో ప్రమోట్ చేస్తామనే సంకేతాన్ని ఇచ్చేందుకే బీజేపీ నేతలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.







