Mobile Siren Sound Test India | దేశవ్యాప్తంగా శనివారం (మే 2న) లక్షలాది మంది మొబైల్ ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద సైరన్ శబ్దం వినిపించవచ్చు. అయితే దీని గురించి ప్రజలు భయపడడం లేదా కంగారు పడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
భవిష్యత్తులో ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యల్లో భాగమే ఇది.
ఎందుకు ఈ పరీక్ష..
భవిష్యత్తులో వరదలు, తుఫానులు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలందరినీ ఒకేసారి అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం ‘సాచెట్’ (SACHET) అనే సరికొత్త వ్యవస్థను రూపొందించింది.
ఈ సిస్టమ్ ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి టెలికమ్యూనికేషన్ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) కలిసి సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి.
ఏం జరుగుతుంది..
మీ మొబైల్ స్క్రీన్పై ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది. దానితో పాటు పెద్ద సైరన్ శబ్దం వినిపిస్తుంది. ఇది కేవలం ఒక ‘టెస్ట్’ మాత్రమే. కాబట్టి ఈ మెసేజ్ లేదా సైరన్ శబ్దం చూసి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనికి మీరు ఎలాంటి రిప్లై ఇవ్వాల్సిన పని లేదు.
ఈ అత్యవసర హెచ్చరిక వ్యవస్థ ‘కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్’ (CAP) ఆధారంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) సిఫార్సు చేసిన ఈ టెక్నాలజీ ప్రస్తుతం దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అందుబాటులో ఉంది.
ఈ సిస్టమ్ వల్ల లాభాలు ఏంటి?
ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు కేవలం సెకన్ల వ్యవధిలోనే లక్షలాది మందికి సమాచారం చేరుతుంది. తుఫానులు, వరదలు వచ్చే ముందు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా హెచ్చరికలు పంపడం ద్వారా ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ప్రమాదం పొంచి ఉన్న నిర్దిష్ట ప్రాంతంలో ఉన్న మొబైల్ ఫోన్లకు మాత్రమే ఈ హెచ్చరికలు వెళ్లేలా ఈ టెక్నాలజీని అత్యంత అధునాతనంగా రూపొందించారు.







