Saraswati Pushkaralu | తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ ఈ పుష్కరాల అధికారిక పోస్టర్ మరియు టీజర్ను ఆవిష్కరించారు.
పుష్కరాల షెడ్యూల్ ఇదే..
సరస్వతీ అంత్య పుష్కరాలు మే 21వ తేదీన ప్రారంభమై జూన్ 1వ తేదీ వరకు మొత్తం 12 రోజుల పాటు జరగనున్నాయి. పుష్కరాల కోసం ప్రభుత్వం రూ.30.63 కోట్లను కేటాయించింది.
ఈ నిధులతో ఘాట్ల నిర్మాణం, రవాణా, ఇతర సౌకర్యాల కోసం మొత్తం 162 రకాల అభివృద్ధి పనులను చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
ఈ 12 రోజుల్లో సుమారు 30 లక్షల మంది భక్తులు కాళేశ్వరం చేరుకుని పుష్కర స్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, నీడ వంటి వసతులు కల్పించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సురేఖ ఆదేశించారు.
కాళేశ్వరంలోని త్రివేణి సంగమ తీరాన భక్తులు ప్రశాంతంగా పుష్కర స్నానం చేసి, స్వామివారిని దర్శించుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.











