Komatireddy Rajagopal Reddy Comments On Kavitha Party | తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీల రాకపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన (TRS)’ను ఉద్దేశిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కవిత తన తండ్రి కేసీఆర్పై చేసిన విమర్శలను తీవ్రంగా తప్పుపట్టారు.
“కేసీఆర్ ఒక ఉద్యమకారుడు. అలాంటి తండ్రి వల్లే కవితకు గుర్తింపు వచ్చింది. కానీ తన మొదటి సమావేశంలోనే సొంత తండ్రిని విమర్శించి ఆమె మర్యాద పోగొట్టుకున్నారు” అని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.
కవిత పార్టీ గురించి ప్రస్తావిస్తూ.. తెలంగాణలో నానుడి అయిన “ఊదు కాలదు, పీరు లేవదు” అనే సామెతను వాడి ఎద్దేవా చేశారు. డబ్బులు ఉంటే పార్టీ పెట్టడం పాన్ షాప్ పెట్టినంత సులభమైపోయిందని చురకలంటించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు ఇంకా క్లీన్ చిట్ రాలేదని, ఆ కేసు ఇంకా కోర్టులో పెండింగ్లో ఉందని ఆయన గుర్తు చేశారు.
టీఆర్ఎస్ పేరును పోలిన ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అని పేరు పెట్టుకోవడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. అన్న కేటీఆర్ మీద ఉన్న కోపాన్ని తండ్రి కేసీఆర్ మీద చూపించడం సరికాదని, ఆమె ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు.







