Missing brother found at Vaishno Devi temple | జమ్మూ కాశ్మీర్లోని పవిత్ర వైష్ణో దేవి ఆలయం ఒక కుటుంబంలో వెలుగులు నింపింది. ఐదేళ్ల క్రితం కనిపించకుండా పోయిన తన సోదరుడిని, ఓ సోదరి ఈ పవిత్ర క్షేత్రంలో కనుగొన్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల కళ్లను చెమర్చుతోంది.
వివరాల్లోకి వెళితే ఐదేళ్ల క్రితం ఒక వ్యక్తి తన కుటుంబానికి దూరమై అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతికి, ఇక అతను తిరిగి రాడనే ఆశ వదులుకున్నారు. అయితే, విధి విచిత్రమైంది. ఇటీవలే ఆ సోదరి, ఆమె తల్లి వైష్ణో దేవి దర్శనం కోసం కత్రా చేరుకున్నారు.
అర్ధకువారి ఆలయం సమీపంలో ఒక వ్యక్తి చిరిగిన బట్టలతో, చిందరవందరగా ఉన్న జుట్టుతో భిక్షాటన చేస్తూ కనిపించాడు. అతన్ని చూడగానే ఆ సోదరికి ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది. ఐదేళ్ల క్రితం పోగొట్టుకున్న తన తమ్ముడే ఆ వ్యక్తి అని గుర్తించి, వెంటనే పరిగెత్తుకెళ్లి అతన్ని కౌగిలించుకుంది.
ఆ వ్యక్తి కూడా తన సోదరిని, తల్లిని గుర్తుపట్టి షాక్కు గురయ్యాడు. తల్లి, కూతురు కన్నీళ్లు పెట్టుకుంటూ అతన్ని హత్తుకోగా, అతను మౌనంగా వారిని చూస్తూ నిలబడిపోయాడు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఎక్స్ (X)లో వైరల్ అవుతోంది. “విశ్వాసం ఉంటే అద్భుతాలు జరుగుతాయని దీనికి మించిన నిదర్శనం ఉండదు” అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.






