Woman Marries Lover In Moving Car | ఇటీవల కాలంలో వివాహ బంధాలకు ఏమాత్ర విలువ లేకుండా పోతోంది. అగ్నిసాక్షిగా మనువాడిన భాగస్వాములు నిర్దాక్షణ్యంగా వదిలి, ప్రేమించిన వారితో వెళ్లిపోతున్న ఘటనలో తరచూ జరుగుతున్నాయి. తాజాగా కర్ణాటకలో అలాంటి ఘటన చోటు చేసుకుంది.
హాసన్ జిల్లాలో అత్యంత విచిత్రమైన, వివాదాస్పదమైన ఘటన వెలుగు చూసింది. ఎనిమిదేళ్ల క్రితం పెళ్లై, ఒక బిడ్డకు తల్లి అయిన ఒక మహిళ.. తన సంసారాన్ని గాలికొదిలేసి కదులుతున్న కారులోనే ప్రియుడిని వివాహం చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.
హాసన్ తాలూకా ముకుందూరు గ్రామానికి చెందిన ప్రకాష్కు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
అయితే, కొంతకాలంగా ఆ భార్య వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. గతంలో కూడా ఆమె ఇంటి నుండి వెళ్లిపోగా, భర్త ప్రకాష్ పెద్దల సమక్షంలో సర్దిచెప్పి తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు.
కాగా నిన్న “ఒంట్లో బాగోలేదు.. ఆసుపత్రికి వెళ్లి వస్తాను” అని భర్తకు చెప్పి బయలుదేరిన ఆమె, సాయంత్రమైనా తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన ప్రకాష్ ఆరా తీయగా, ఆమె తన ప్రియుడితో కలిసి కారులో పారిపోయినట్లు తెలిసింది.
ఆమె కారులో ప్రయాణిస్తుండగానే, ప్రియుడు ఆమె మెడలో తాళి కట్టి, కాళ్లకు పట్టీలు తొడిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎనిమిదేళ్ల బిడ్డను, కట్టుకున్న భర్తను విస్మరించి, దొంగచాటుగా కారులో పెళ్లి చేసుకోవడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భార్య చేసిన పనితో మనస్తాపం చెందిన ప్రకాష్ పోలీసులను ఆశ్రయించాడు. గతంలో ఒకసారి రాజీ పంచాయతీ జరిగినప్పుడు పోలీసులు ఆమెను ప్రశ్నించగా, భర్త వేధిస్తున్నట్లు ఆమె ఏనాడూ ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.
ప్రస్తుతం మొబైల్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు ఆమె ఆచూకీని గుర్తించారు. బిడ్డ భవిష్యత్తును నాశనం చేసిన భార్యపై చర్యలు తీసుకోవాలని ఆ భర్త కన్నీటి పర్యంతమవుతున్నాడు.






