Green Asha LPG vessel Reaches India | పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా మరియు ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న భీకర యుద్ధ వాతావరణం మధ్య భారత్ ఒక కీలక మైలురాయిని అధిగమించింది.
భారత్ జెండాతో ప్రయాణిస్తున్న ఎల్పీజీ నౌక ‘గ్రీన్ ఆశా’ అత్యంత ఉద్రిక్తతలు నెలకొన్న హార్ముజ్ జలసంధి ని విజయవంతంగా దాటుకుని గురువారం ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (JNPA)కి చేరుకుంది.
ఈ నౌక సుమారు 15,400 టన్నుల ఎల్పీజీని (LPG)ను మోసుకువచ్చింది. ఇది బీపీసీఎల్-ఐఓసీఎల్ ఆధ్వర్యంలోని లిక్విడ్ బెర్త్ లో క్షేమంగా లంగరు వేసింది.
నౌకలోని సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని, సరుకు కూడా ఎటువంటి నష్టం లేకుండా చేరిందని ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఇప్పటివరకు మొత్తం 8 భారతీయ నౌకలు ఈ మార్గం గుండా సురక్షితంగా ప్రయాణించాయి. దేశంలో ఎల్పీజీ సరఫరా పరిస్థితిపై కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ భరోసా ఇచ్చారు.
“యుద్ధ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ షిప్పులు నిరంతరాయంగా వస్తూనే ఉన్నాయి. ప్రయాణ సమయంలో ఎటువంటి జాప్యం జరగడం లేదు.
ప్రభుత్వం ప్రతిరోజూ పరిస్థితిని సమీక్షిస్తోంది” అని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ చమురు మరియు గ్యాస్ సరఫరాలో హార్ముజ్ జలసంధి అత్యంత కీలకమైన మార్గం.
ఇరాన్ ఈ జలసంధిని మూసివేస్తామని హెచ్చరిస్తున్న తరుణంలో, భారతీయ నౌక ‘గ్రీన్ ఆశా’ విజయవంతంగా రావడం భారత దౌత్య మరియు నౌకాయాన పటిమకు నిదర్శనంగా నిలిచింది. దీనివల్ల దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందన్న ఆందోళనలకు తెరపడింది.






