TVAEJAC Strike | తెలంగాణ లోని విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిసన్, అన్మ్యాన్డ్ మరియు పీస్రేటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAEJAC) సమ్మె సైరన్ మోగించింది.
ఏప్రిల్ 8 ఉదయం 9:00గంటల నుండి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు కమిటీ ప్రకటించింది.
ప్రధాన డిమాండ్లు ఇవే..
విద్యుత్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. విద్యా అర్హతల ఆధారంగా ఆర్టిసన్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఆర్టిసన్లకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలనీ, టీజీఎన్పీడీసీఎల్మరియు టీజీఎస్పీడీసీఎల్ లో అన్మ్యాన్డ్ వర్కర్లను ఆర్టిసన్లుగా లీనం చేసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
2016డిసెంబర్ 4కంటే ముందు అర్హత ఉండి పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను ఆర్టిసన్లుగా గుర్తించాలని కోరుతున్నారు. 2026 పీఆర్సీ ని తక్షణమే అమలు చేయాలనీ, పీస్రేటు కార్మికులకు జీవో నంబర్ 11ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
నిరవధిక సమ్మెకు ముందే ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేసేందుకు జేఏసీ భారీ కార్యాచరణను ప్రకటించింది. మార్చి 26 నుంచి 30 వరకు అన్ని ఆపరేషన్ డివిజన్ ఆఫీసుల ఎదుట ధర్నా చేపడుతోంది.
అనంతరం ఏప్రిల్ 2నఅన్ని ఆపరేషన్ సర్కిల్ ఆఫీసుల ఎదుట వంటా-వార్పు నిరసన చేపట్టనుంది. ఏప్రిల్ 4నపాల్వంచలోని KTPS గేట్ వద్ద టీజీజీఈఎన్సీవో ఎదుట ధర్నా నిర్వహించనుంది. ఏప్రిల్ 7నవరంగల్లోని టీజీఎన్పీడీసీఎల్ విద్యుత్ భవన్ ఎదుట మహాధర్నా చేపట్టనుంది.
ఈ నిరసనల అనంతరం కూడా ప్రభుత్వం స్పందించని పక్షంలో ఏప్రిల్ 8 నుంచి విద్యుత్ సేవలను బహిష్కరించి సమ్మెకు వెళ్తామని కార్మికులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు.










