Deputy Cm Pawan Kalyan News | ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం పెడన నియోజకవర్గంలో పర్యటించారు. కృత్తివెన్ను మండల పరిధిలోని పెదచందాల గ్రామానికి చెందిన చందు వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించారు. గత ఏడాది జులైలో దిగమర్రు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వసంతరాయలుకి బ్రెయిన్ డెడ్ కాగా, అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాన్ని స్వయంగా కలిసి పరామర్శించి భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు బుధవారం పెదచందాలలోని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. భార్య నాగ పుష్పావతి, కుమారుడు సీతారామరాజు, కుమార్తె జాహ్నవిలను ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ స్థితిగతులపై ఆరా తీశారు. తండ్రి మరణానంతరం ఉద్యోగం వదిలి కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్న సీతారామరాజుని అభినందించారు. కుమార్తె జాహ్నవికి వినికిడి లోపం, మాటలు రావని తెలిసుకుని టీటీడీ శ్రవణం ప్రాజెక్టు ద్వారా సాయం చేయాలని అధికారులకు సూచించారు. సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ స్కీం కింద ఉపాధి కల్పించే ఏర్పాటు చేయాలన్నారు. మీ కష్టంలో మేము తోడుంటామంటూ పవన్ ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.








